హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. 2015, 2020 తరువాత ఈ ఏడాదే మన రాష్ట్ర శకటానికి ఈ అవకాశం దక్కింది. ‘ప్రజాస్వామ్యం’ థీమ్తో శకటాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
కుమ్రంభీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర ఉద్యమకారుల వీరోచిత పోరాటాలను ఇతివృత్తంగా చూపించనున్నారు. ఆనాటి స్వీయపాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి మరోసారి ప్రపంచానికి తెలిసేలా రిపబ్లిక్ డే వేడుకల్లో మన రాష్ట్ర శకటాన్ని రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఆయా స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాలకు తెలంగాణకు చెందిన ఐదుగురు మహిళా సర్పంచులను ఆహ్వానించారు. భర్తలు సహా వేడుకలకు రావాల్సిందిగా పేర్కొన్నారు. వారిలో పాపిశైట్టి శైలజ (ఖమ్మం), ఎం అనితారాణి (ములుగు), పీ సురేఖ (నాగర్కర్నూలు), బక్క రమాదేవి (సంగారెడ్డి), కాంతి లక్ష్మి (వికారాబాద్) ఉన్నారు. వీరు ఈనెల 24న ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేసినందుకు, స్వచ్ఛ గ్రామాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురు సర్పంచులకు ఆహ్వానం పలికినట్టుగా తెలిసింది.