హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఇటీవల ప్రారంభమైన ఆంకాలజీ బ్లాక్ మరో 10 రోజుల్లో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 ఎకరాల స్థలంలో రూ.80 కోట్ల వ్యయంతో 8 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవన సముదాయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అరబిందో ఫార్మా సంస్థ నిర్మించిన ఈ భవన సముదాయాన్ని మొత్తాన్ని శుద్ధిచేసి ఇన్ఫెక్షన్ రహితంగా మార్చిన తర్వాతే అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నది. ముఖ్యంగా ఆ భవనంలోని వార్డులు, ఆపరేషన్ థియేటర్లను రసాయనాలతో శుద్ధి (ఫ్యుమిగేషన్) చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ పనులు చురుకుగా కొనసాగుతున్నట్టు దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.
ప్రస్తుతం ఎంఎన్జే దవాఖానలో 450 పడకలు ఉండగా.. కొత్తగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్తో మరో 300 పడకలు వచ్చాయి. దీంతో మొత్తం పడకల సంఖ్య 750కి పెరిగింది. కొత్తగా 3 విభాగాల (ఉమెన్ వింగ్, పీడియాట్రిక్ వింగ్, బోన్మ్యారో వింగ్)తోపాటు 12 కన్సల్టేషన్ రూమ్లు, 8 బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ రూమ్లు, ఐసీయూ వార్డులు, రోగ నిర్ధారణ విభాగాలు, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్లు, భోజనశాలలను ఏర్పాటు చేశారు. రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా 2 బంకర్లను నిర్మించారు. వీటన్నింటినీ దశలవారీగా ఫ్యుమిగేషన్ చేస్తున్నట్టు డాక్టర్ జయలత వివరించారు.
నూతన ఆంకాలజీ బ్లాక్లో రూ.60 కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. రోబోటిక్ సర్జరీలకు అవసరమైన యంత్రాలు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్-స్కాన్ తదితర పరికరాలతోపాటు ఆపరేషన్ థియేటర్లలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ జయలత తెలిపారు.
ఎంఎన్జేలో నూతన ఆంకాలజీ బ్లాక్ను తీసుకొచ్చేందుకు అన్ని రకాల శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నాం. ప్రస్తుతం ఈ భవన సముదాయాన్ని ఫ్యుమిగేషన్ చేస్తున్నాం. ఆ తర్వాత స్వాబ్ టెస్టులు నిర్వహించి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందేమో పరీక్షిస్తాం. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడానికి వారం పదిరోజుల సమయం పట్టవచ్చు. ఆ వెంటనే నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం.
– డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన