హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా గురువారం రాష్ట్రంలోని పలు అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా అనాథలకు ప్రభుత్వమే తల్లీదండ్రిగా ఉండి, సంరక్షణ చేపట్టి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తీసుకొచ్చే నూతన విధానంలో ఎలాంటి అంశాలు ఉండాలో చెప్పాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. ఈ అభిప్రాయాలన్నిటిని క్రోడీకరించి కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తామని, అత్యుత్తమ విధాన రూపకల్పన కోసం ప్రతిపాదనలు సమర్పిస్తామని తెలిపారు.