Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రతీకలను కండ్లకు కట్టింది. గురువారం రాత్రి హుస్సేన్సాగర్ పైన నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి అద్దంపట్టింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా తెలంగాణ అమరజ్యోతి ప్రారంభం అనంతరం ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణ అమరులకు జోహార్ల అర్పణతో మొదలైన ఈ డ్రోన్ షో 15 నిమిషాలపాటు ఏకబిగిన సాగి ఆహూతులను, వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
తెలంగాణ రాజముద్ర (చార్మినార్తో కూడిన కాకతీయ విజయతోరణం).. బతుకమ్మ, పాలపిట్ట, పిడికెలెత్తిన తెలంగాణ, కేసీఆర్.. ఆయనను అనుసరించి నినదించే సమూహం, కాళేశ్వరం, టీ-హబ్, పది జిల్లాల నుంచి 33 జిల్లాలుగా అవతరణ, కృష్ణా, గోదావరి ప్రవాహం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, గన్పార్క్లోని అమరవీరుల స్థూపం, తెలంగాణ అమరజ్యోతి వంటి 13 చిహ్నాల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శన కోసం మొత్తం 750 డ్రోన్లను ఉపయోగించారు. ప్రదర్శన ప్రారంభం నుంచి ముగిసే వరకు కరతాళ ధ్వనులతో హుస్సేన్సాగర్ తీరం మార్మోగింది. సీఎం కేసీఆర్ సైతం ఆసాంతం తిలకించి పరవశించిపోయారు.