హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను, రిటైర్డ్ ఐఏఎస్లను, ఐపీఎస్లను, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, వివిధ వర్గాల మేధావులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
నిపుణుల కమిటీని వేస్తామని, వారు ఇప్పటివరకు కులగణన నిర్వహించిన బీహార్, ఏపీలో పర్యటించి సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయొద్దని సీఎం రేవంత్రెడ్డిని జాజుల కోరారు.