మెదక్ : కరోనా వైరస్ ఓ పెళ్లికి తిప్పలు తెచ్చిపెట్టింది. పెళ్లి జరుగుతున్న గ్రామంలో కరోనా బాధితుడు మృతి చెందడంతో వివాహ తంతు నిర్వహించాల్సిన పండితుడు అక్కడికి వచ్చేందుకు ధైర్యం చేయలేదు. దీంతో పండితుడు వాట్సాప్ వీడియో కాల్లో మంత్రాలు చదవగా.. పెళ్లి మండపంలో నూతన వధూవరులు ఒక్కటయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
టేక్మాల్ మండలానికి చెందిన పాల్వోత్ మోహన్కు పాపన్నపేట మండలం సోమ్లా తండాకు చెందిన బానోత్ మంజులకు వివాహం కుదిరింది. ముందే నిర్ణయించుకున్న ముహుర్తం ప్రకారం ఇవాళ పెళ్లి. అయితే ముహుర్తం సమయానికి వరుడి ఇంటికి సమీపంలో ఓ కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పండితుడు.. తాను పెళ్లికి రాలేనని తెగేసి చెప్పాడు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పెళ్లి జరిపించాలని పండితుడిని వేడుకోవడంతో.. ఆన్లైన్లో మంత్రాలు చదివి పెళ్లి చేస్తానని ఆఫర్ ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి వాట్సాప్ వీడియో కాల్లో పండితుడు మంత్రాలు చదవగా, మండపంలో వరుదు వధువుకు తాళికట్టి, దండలు మార్చుకున్నారు. మొత్తానికి పెళ్లి విజయవంతంగా ముగిసింది.
ఇవి కూడా చదవండి..