ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం వెళ్లే భక్తుల కారును లారీతో పాటు బస్సు ఢీకొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మేడారం వెళ్లే భక్తులు ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మేడారం జాతరకు(Medaram jatara) భక్తులు పోటెత్తారు. వరుస సంక్రాంతి సెలవులు రావడంతో మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అమ్మవార్లకు ముందుస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో ఇరువైపులా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో పస్రా- మేడారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. కాగా, ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు మేడారాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై సమీక్షనుంచనున్నారు.