హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి ఇప్పటివరకు తమిళనాడు మినహా మరే రాష్ట్రమూ సుముఖత వ్యక్తం చేయలేదు.
నీటి లభ్యతపై అనేక సందేహాలను లేవనెత్తుతూ తమ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని ఆయా రాష్ర్టాలు పట్టుబడుతున్నాయి. ఆయా రివర్ బేసిన్లలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రతో ఎన్డబ్ల్యూడీఏ చర్చలు జరుపుతూ వస్తున్నది. రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. తుపాకులగూడెం బరాజ్ నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ఎన్డబ్ల్యూడీఏ తాజాగా ప్రతిపాదించింది. మొత్తంగా 324 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది.