హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అందరూ ఆసక్తిగా ఆరా తీస్తున్న బీఎల్ సంతోష్ పూర్తిపేరు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో టాప్-4లో ఉన్న కీలకనేత ఈయన. జాతీయస్థాయిలో పార్టీకి సంబంధించిన చాలా కీలకమైన అంశాలను బీఎల్ సంతోష్ పర్యవేక్షిస్తుంటారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ దూతలు ప్రలోభాలకు గురిచేసే క్రమంలో బయటపడిన ఆడియోలలో బీఎల్ సంతోష్ పేరు వినిపిస్తున్నది. రూ.వందల కోట్లు ఎరవేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, బీజేపీ తరఫున దూతగా వచ్చిన రామచంద్రభారతి మధ్య జరిగిన సంభాషణల్లో బీఎల్ సంతోష్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. రోహిత్రెడ్డి, రామచంద్రభారతిలు కలిసేరోజు బీఎల్ సంతోష్జీ కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వస్తారంటూ నందూ చెప్పారని ఆడియోలో స్పష్టంగా ఉంది. మొత్తం డీల్ను కనుసన్నల్లో నడిపించింది బీఎల్ సంతోషేనని అర్థమవుతున్న నేపథ్యంలో ఆయన ఎవరనేదానిపై ఆసక్తి నెలకొన్నది.
కర్ణాటకలోని ఉడిపికి చెందిన బీఎల్ సంతోష్.. దావణగెరెలోని బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఇంస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ చదివారు. 1993లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2006లో కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన బీఎల్ హ యాంలోనే 2008 నుంచి 2013 వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా ప్రతాప్సింహ, తేజస్వీసూర్య లాంటి యువకులను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక బీఎల్ సంతోష్ కీలకపాత్ర పోషించారని చెప్పుకొంటారు. 2014లో బీజేపీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీగా, 2019లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అటు కర్ణాటకలోనూ, ఇటు జాతీయ స్థాయిలోనూ బీజేపీ అంతర్గత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అప్పటి ముఖ్యమం త్రి యెడియూరప్ప ఆలోచనలకు భిన్నంగా అశోక్ గస్తి, ఈరన్న కడాదిలను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం బీఎల్ సంతోష్కు పార్టీ నాయకత్వంపై ఉన్న పట్టుకు ఉదాహరణగా చెబుతారు.
కీలక వ్యవహారాలు నడిపేది ఆయనే..
బీజేపీలో కీలకమైన నేతగా బీఎల్ సంతోష్ వ్యవహారాలు చక్కబెడతారు. ఒక రాష్ట్ర రాజధాని నుంచి మరో రాష్ట్ర రాజధానికి ప్రయాణించే బీఎల్ సంతోష్ను.. అక్కడి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తప్పకుండా కలుస్తుంటారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్కు, బీజేపీ మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ మధ్యన సంధానకర్తలా వ్యవహరిస్తుంటారని పేరు. అందుకే బీజేపీ వ్యవహారాలను నడిపించడంలో అంతటి శక్తిమంతుడిగాకూడా కనపడుతుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు బీఎల్ సంతోష్ను కలవాలంటే.. అపాయింట్మెంట్ తీసుకోవాలని పార్టీలోనే చెప్పుకొంటారు. పైగా అన్ని రాష్ర్టాలు (బీజేపీ పాలిత) తిరుగుతూ.. అక్కడి పరిపాలన తీరుపై మంత్రులను అడిగి తెలుసుకుంటారు. తరువాత సీఎంలతో చర్చ సందర్భంగా పలు సూచనలుకూడా చేస్తారని ప్రతీతి. అలాగే ప్రధాని మోదీ తీసుకునే కఠినమైన నిర్ణయాలను చేరవేయడంలో సిద్ధహస్తుడని చెప్పుకొంటారు. గతంలో గుజరాత్ సీఎం విజయ్రూపానీ, త్రిపుర సీఎం బిప్లబ్దేవ్ల రాజీనామాలకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బీఎల్ సంతోష్ ద్వారా చేరవేశారని ప్రచారంలో ఉంది. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని బీజేపీలో, పరిపాలనలో సమర్థవంతంగా చొప్పించడం వెనుక కీలకపాత్ర బీఎల్ సంతోష్దేనని చెప్పుకొంటారు. తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టే సంతోష్.. సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటారు. ఇంతటి కీలకమైన వ్యక్తి గనుకనే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే కార్యక్రమాన్ని ఆయనే నడిపించినట్టుగా ప్రజలు అనుమానిస్తున్నారు. సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరునే ప్రస్తావించి.. ఆయనకూడా వస్తారని దూ తలు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆయన ప్రమేయం తో, ఆయన సూచనలమేరకు ఈ ప్రలోభ ప్రక్రియను చేపట్టినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు.