మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి సేవ చేసేందుకు ఈనెల 18న ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్లో ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
జిల్లా నుంచి లక్షా 20 వేల మందిని సభకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన బీఆర్ఎస్కు ఎదురు లేదని అన్నారు. కొంతమంది సన్నాసులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.
తెలంగాణ రాకముందు, వచ్చిన తరవాత ఎలాంటి అభివృద్ది జరిగింది అనే విషయాన్ని అందరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. 24 గంటల ఉచిత కరెంట్ వల్ల ఏటా రూ. 10,500 కోట్లను డిస్కం లకు చెల్లిస్తున్నామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు, తాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్ రెడ్డి, జిల్లా మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.