మహబూబాబాద్, జనవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి చేసినా దేశవ్యాప్తంగా సంచలనమేనని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్న నేపథ్యంలో జన సమీకరణపై మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఖమ్మం సభ దేశ రాజకీయాలకు నిర్దేశం చేస్తుందని చెప్పారు. ఈ సభకు మానుకోట నుంచి కనీసం 50 వేల మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే మానుకోటకు మళ్లీ వస్తారని తెలిపారు.