Congress | ఏమండోయ్.. ఇది విన్నారా??
విద్యుత్తు కోతలపై కర్ణాటకలోని స్కాంగ్రెస్ సర్కారు ఘనమైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడ్రోజుల పాటు చర్చోపచర్చలు జరిపింది.కరెంటు అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు నిర్వహించింది. మరి అంత అద్భుతమైన ప్రకటన ఏంటంటే..వ్యవసాయానికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 గంటల కరెంటు. అదీ నిరంతరాయంగా సరఫరా చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిండ్రు. ఈ ప్రకటన చూసి జనాలు నవ్వుకొంటున్నరు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు విద్యుత్తు విధానంతో పోల్చుతూ చురకలు అంటిస్తున్నరు. ఎందుకో తెలుసుకొందాం పదండి!!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన అధికార కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్నారు. కర్ణాటకలో విద్యుత్తు కోతలపై ‘కన్నడనాట కటిక చీకట్లు’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కోతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు కోతలకు పరిష్కారాన్ని చూపడానికి గడిచిన మూడు రోజులుగా విద్యుత్తుమంత్రి కేజే జార్జ్ విద్యుత్తు ఉన్నతాధికారులతో, ప్రభుత్వ పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహించారు. కరెంటు కోతలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు. చివరగా మంగళవారం అధికారులతో భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చారు. ‘వ్యవసాయానికి నిరంతరాయంగా 5 గంటల పాటు కరెంటును ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం’ అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి ఇలా షిఫ్టుల వారీగా విద్యుత్తు సరఫరా ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని పత్రికలు, టీవీలు, రేడియోల ద్వారా రైతులకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఎంతో ఉపశమనం లభిస్తుందంటూనే తామేదో గొప్ప ప్రకటన చేసినట్టు మంత్రి గప్పాలకు పోయారు. తీరా.. ఈ ప్రకటన చూసిన జనం నవ్వుకొంటున్నారు. ‘కొండంత రాగం తీసి.. కూసంత పాటపాడిన’ చందంగా ప్రభుత్వ వైఖరి ఉన్నదంటూ సర్కారుపై మండిపడుతున్నారు.
తెలంగాణలో 24 గంటలపాటు నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తుంటే.. 5 గంటల కరెంటు సరఫరాకే కాంగ్రెస్ సర్కారు ఆర్భాటపు ప్రకటనలు చేయడంపై పలువురు చురకలు అంటిస్తున్నారు. అధికారమిచ్చిన ఐదు నెలలకే కర్ణాటకను చీకటిపాలు చేసిన ఘనత కాంగ్రెస్దైతే.. సమైఖ్య పాలనలో చీకట్లో మగ్గిన తెలంగాణను కేవలం ఐదు నెలల్లోనే వెలుగులబాట పట్టించిన ఘనత కేసీఆర్దేనంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘మొన్నటికి మొన్న.. ఒకడు (రేవంత్ రెడ్డి) ఎవుసానికి మూడు గంటల కరెంటు ‘మస్తు.. పో’ అన్నడు.. ఇప్పుడు.. ‘5 గంటల కరెంటు ఇస్త్తం. పండుగ చేస్కోండి’ అన్నట్టు కర్ణాటక స్కాంగ్రెస్ సర్కారు గప్పాలకు పోతున్నదం’టూ విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను లోతుగా విశ్లేషిస్తే, నిజమేనని అర్థమవుతున్నది. కర్ణాటకలో అధికారంచేపట్టిన కాంగ్రెస్ కేవలం ఐదు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగమాగం చేసింది. విద్యుత్తు కోతలతో అన్ని రంగాలను కుదేలయ్యేలా చేసింది. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఐదారు నెలల్లోనే సీఎం కేసీఆర్ చీకట్లలో మగ్గిన రాష్ర్టాన్ని వెలుగుబాట పట్టించారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 2,700 మెగావాట్ల విద్యుత్తులోటు ఉండేది. పంటలు పండక, అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యేవి. ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టికేంద్రీకరించిన సీఎం.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావును నియమిస్తూ జీవో నంబర్ 1 విడుదల చేశారు. మొట్టమొదటి సమీక్ష కూడా విద్యుత్తుపైనే. అలా విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ కేవలం ఆరునెలల్లోనే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేసే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకొచ్చారు.
మొన్న ఒకడు ఎవుసానికి మూడు గంటల కరెంటు ‘మస్తు.. పో’ అన్నడు..
ఇప్పుడు, ‘5 గంటల కరెంటు ఇస్త్తం. పండుగ చేస్కోండి’ అన్నట్టు మాట్లాడుతుండ్రు..
స్కాంగ్రెస్కు ఓటేస్తే, ఏం జరుగుతుందో.. జెర అర్థమవుతుందాయే నీకు?!