హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎంటెక్ చదివి సన్యాసం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన భార్య, అత్త పేరుపై రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడ చెప్పుకున్నది గుడిలో పూజారిగా.. అసలు వేషం మాత్రం దళారి. క్యాన్సర్ వచ్చిందని చెప్తాడు.. గోమూత్రం తాగి, దానితోనే స్నానం చేస్తే తగ్గిపోయిందంటాడు.. ఆయనే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిన ముఠాలోని రామచంద్ర భారతి అలియాస్ సతీశ్శర్మ. అతడికి రెండు పేర్లు.. రెండేసి ఆధార్కార్డులు.. పాన్కార్డులు.. లైసెన్స్లు ఉన్నాయి. రామచంద్ర భారతికి సంబంధించిన ఆసక్తికర అంశాలను న్యూస్ లాండ్రీ వెబ్సైట్ వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం.. రామచంద్ర భారతిది కేరళ. ఇటీవల హర్యానాలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్ను కొన్నాడు. దానిని భార్య, అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. 2020లో హైదరాబాద్లో నిర్వహించిన ‘వాజపేయ సోమయాగం’లో తననుతాను సన్యాసిగా చెప్పుకొన్నాడు. దురాశ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాడు. ఈ యా గంలో తాను, మరో నిందితుడు సింహయాజి పక్కపక్కనే కూర్చున్నారు. నాటి యాగం వీడియోలో ఓ మహిళ రామచంద్ర భారతిని అక్కడున్న వారికి పరిచయం చేస్తూ.. ఆయన మంగళూరు యూనివర్సిటీ నుంచి ఎంటెక్ పట్టా తీసుకున్నారని చెప్పింది. 2009లోనే ఉత్తరాఖండ్లోని ఓ ఆశ్రమంలో సన్యాసం స్వీకరించారని పేర్కొన్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పాలు పంచుకొంటున్నారని చెప్పినట్టు న్యూస్ లాండ్రీ వెల్లడించింది.
ఆ వీడియోలో రామచంద్ర ప్రసంగం కూడా ఉన్నది. తాను సింహయాజి ఆహ్వానిస్తేనే వచ్చానని చెప్పాడు. గతంలో జర్మనీకి చెందిన ఐటీ సంస్థలో పనిచేశానన్నాడు. డబ్బు కోసం కొన్ని గంటలపాటు కంప్యూటర్ ముందు గడిపానని, ఇప్పుడు డబ్బును దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 2004లో తనకు క్యాన్సర్ సోకిందని, రెండేండ్లు మాత్రమే బతుకుతావని డాక్టర్లు చెప్పారన్నాడు. రాజస్థాన్లోని పత్మెడా ప్రాంతానికి వెళ్లానని.. గోమూత్రం తాగానని, గోమూత్రంతో రోజుకు రెండుసార్లు స్నానం చేశానని చెప్పుకొచ్చాడు. ఆరు నెలల తర్వాత క్యాన్సర్ తగ్గిందని, ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు.
న్యూస్లాండ్రీ ప్రకారం.. హర్యానాలోని రామచంద్ర భారతి ఫ్లాట్ ప్రస్తుతం తాళం వేసి ఉన్నది. అతడు అరెస్టయిన రోజునే భార్య, అత్త ఎక్కడికో వెళ్లిపోయారు. ఫ్లాట్ పార్కింగ్ ప్లేస్లో రెండు ఎస్యూవీలు పార్క్ చేసి ఉన్నాయి. ఇందులో ఒకటి తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్నది. ఇంటికి 200 మీటర్ల దూరంలోని శ్రీకృష్ణ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్టు ఇరుగుపొరుగు చెప్పారు. ఆ గుడిని ‘శ్రీ కృష్ణసేవా సమితి’ (ఎస్కేఎస్ఎస్) అనే ట్రస్ట్ నిర్వహిస్తున్నది. ఈ సమితి దేశవ్యాప్తంగా పలు ఆలయాలను నిర్వహిస్తున్నది. ఈ ఏడాది మార్చిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ను కలిసిన ఎస్కేఎస్ఎస్ ప్రతినిధుల్లో రామచంద్ర భారతి కూడా ఉన్నాడు. అతడు ఏడాదిగా ఎస్కేఎస్ఎస్లో ఉంటున్నట్టు సమితి వర్గాలు తెలిపాయి. న్యూస్ లాండ్రీ ప్రచురించిన రామచంద్ర భారతి వివరాలను పరిశీలిస్తే.. అతడు ప్రపంచానికి ఒక రకంగా, లోపల మరో రకంగా ఉంటాడని అర్థం అవుతున్నది.