తాంసి(భీంపూర్), జనవరి 25: అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. పిప్పల్కోటికి చెందిన రైతు ఎల్మల స్వామి (38) తనకున్న నాలుగెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో రూ.1.6 లక్షలు అప్పు చేశాడు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణం మాఫీ, రైతుబంధు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.
అప్పు ఎలా తీర్చాలో తెలియక తన చేనులోనే బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై లాలు సింగ్నాయక్ తెలిపారు. కాగా, ఇదేగ్రామానికి చెందిన కౌలు రైతు ఎడిపెల్లి రమేశ్ (48) ఈ నెల 10న ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దిగుబడి రాకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు.