హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్త బొగ్గు, లోహ గనులకు సంబంధించిన రెస్యూ జట్లకు జాతీయస్థాయిలో నిర్వహించే వార్షిక పోటీలకు పదేండ్ల తర్వాత సింగరేణి కాలరీస్ మరోమారు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో రెస్క్యూ పోటీలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) భూషణ్ ప్రసాద్సింగ్ మాట్లాడుతూ.. గతంలో మూడుసార్లు సింగరేణిలో రెస్క్యూ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు.
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రామగుండం-1లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో, 7ఎల్ఈపీ గనిలో పోటీలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ పోటీల్లో కోల్ ఇండియా అనుబంధ 8 బొగ్గు కంపెనీలు, ఆతిథ్య సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తోపాటు యురేనియం కార్పొరేషన్ ఇండియా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మొదలైన 10 సంస్థల నుంచి సుమారు 25 జట్లు పాల్గొంటాయని తెలిపారు. పోటీల నిర్వహణకు త్వరలోనే సన్నాహక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంఎస్ శ్యామ్ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు, డీజీఎం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.