జిన్నారం, సెప్టెంబర్ 7 : సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఖాజిపల్లి గ్రామ శివారులోని కంకర క్రష్షర్ల సమీపంలో బుధవారం చిరుత సంచరించింది. మధ్యాహ్నం సమయంలో కంకర క్రష్షర్ల సమీపంలోని అడవిలో ఓ రాయిపై చిరుత పడుకొని ఉండడాన్ని టిప్పర్ డ్రైవర్ గుర్తించి తన ఫోన్లో ఫొటోలు తీశాడు.
అనంతరం తన వాహన యజమాని బీమాకు తెలిపారు. బీమా వెంటనే అటవీ శాఖ అధికారుకులసమాచారం ఇచ్చారు. గడ్డపోతారం అరబిందో పరిశ్రమ వెనుక వైపు కూడా బుధవారం చిరుత సంచరించిన అడుగులను గుర్తించారు.
ఖాజిపల్లి శివారులో కనిపించిన చిరుత, గడ్డపోతారం అరబిందో పరిశ్రమ వెనుక కనిపించిన చిరుత అడుగులు వేరువేరని గ్రామస్తులు తెలిపారు. కాగా, చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరు కూడా అధైర్యపడొద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.