హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టే అక్రమ, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తేలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. భూమి విషయంలో తమను దుర్భాషలాడారంటూ ఆయనతోపాటు పలువురి మీద పోచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంపై పల్లా స్పందించారు. అసలు ఫిర్యాదుదారులు ఎవరో తనకు తెలియదని, వారి ముఖం చూసిన, వారిని కలిసిన దాఖలాలు లేవని వెల్లడించారు. వాస్తవానికి ఫిర్యాదు వస్తే అసలు వారిని తాము ఎక్కడ కలిశాం? ఎప్పుడు వారితో మాట్లాడాం? ఏ సందర్భంగా దుర్భాషలాడాం? అనే కనీస వివరాలు ఉండాలని… ఇవేవీ లేకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
ఏమాత్రం విచారణ లేకుండా ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు అని అర్థమవుతున్నదని చెప్పారు. ఏడున్నర ఎకరాల భూమిని గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్టు పేరిట చట్టపరంగా కొనుగోలు చేశామని, అనంతరం నిబంధనల ప్రకారం మ్యుటేషన్ కూడా చేయించుకున్నామని వెల్లడించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో సంబంధిత జిల్లా కలెక్టర్, తాసిల్దార్ ఇది ట్రస్టుకు చెందిన భూమి అని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉన్నదని ఎన్వోసీ కూడా ఇచ్చారని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న వెనక ఉండి కొందరితో కుట్రపూరితంగా ఈ ఫిర్యాదులు చేయిస్తున్నారని, పోలీసులు సైతం ఏమాత్రం విచారణ చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న ఓ చోటా నయీంలా అవతారమెత్తుతున్నారని పల్లా ఆరోపించారు. తానుగానీ.. తన భార్యకానీ ఈ భూ వ్యవహారంలో ఎవరినీ కలువలేదని, ఎవరినీ దుర్భాషలాడలేదని పల్లా స్పష్టం చేశారు. ఒకవేళ ఫిర్యాదుదారులు నిజంగానే భూమి నష్టపోతే న్యాయపరంగా కోర్టుకు వెళ్లాలి కానీ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా సివిల్ తగాదాలపై పోలీసుస్టేషన్లో కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. 25 ఏండ్ల క్రితమే అక్కడ విద్యాసంస్థను స్థాపించామని, నాటి నుంచి నేటి వరకు కూడా భూములకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు చట్టపరిధిలోనే జరిగాయని, వాటికి సంబంధించి అన్నిరకాల అనుమతులు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఉన్నాయని వివరించారు.
వాస్తవానికి ఎప్పటినుంచో తనపై కేసు పెట్టించేందుకు తీన్మార్ మల్లన్న, ఇతరులు ప్రయత్నిస్తున్నారని, కానీ గతంలో ఉన్న ఇన్స్పెక్టర్ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేందుకు నిరాకరించారని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీంతో సదరు ఇన్స్పెక్టర్పై చాలారోజులు వివిధ మార్గాల్లో ఒత్తిడి కూడా చేశారని, చివరికి ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేసి… మరొకరిని తీసుకువచ్చి ఇప్పుడు తనపై కేసు పెట్టించారని చెప్పారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్న ఆయన… చట్టపరంగా, న్యాయపరంగానే ఈ వ్యవహారాన్ని తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.