మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్టించాడు. ధైర్యంగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన విద్యార్థిని పోలీసులు మెచ్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు స్కూల్లో అనిల్ నాయక్ అనే విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలం నుంచి మ్యాథ్స్ టీచర్ ఆ విద్యార్థిని కొడుతున్నాడు. దీంతో టీచర్ దెబ్బలను భరించలేని బాధిత విద్యార్థి ఏకంగా పోలీసు స్టేషన్కు వెళ్లి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. మ్యాథ్స్ టీచర్ తనను కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రమాదేవికి అనిల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాధారణంగా చిన్నపిల్లలు పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు మారాం చేస్తే.. పోలీసులకు పట్టిస్తామని భయపెడతారు. కానీ, ఇటీవలి కాలంలో పిల్లలు ధైర్యంగా పోలీస్స్టేషన్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లపై ఫిర్యాదులు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇటీవల కర్నూల్ జిల్లా పెద్ద కడుబూరులో పెన్సిల్ కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోజూ తన బ్యాగ్లో నుంచి పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడంటూ ఓ విద్యార్థి తన స్నేహితుడితో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదంటూ బాధిత విద్యార్థి ఏకంగా పోలీస్స్టేషన్కు వెళ్లాడు. పెన్సిల్ దొంగతనం చేసిన తన స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.