Nizamabad | నిజామాబాద్ : ఓ మూడేండ్ల బాలుడిని రెండు పాములు ఒకేసారి కాటేశాయి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బినోల గ్రామానికి చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులకు రుద్రాన్ష్(3), కుమార్తె(3 నెలలు) ఉన్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూమయ్య ఇంట్లోని ఓ గది కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న మరో గదిలో పిల్లలతో కలిసి శుక్రవారం రాత్రి నిద్రించారు. ఈ క్రమంలో రెండు పాములు వచ్చి రుద్రాన్ష్ను కాటేశాయి. బాలుడు ఆ నొప్పి భరించలేక గట్టిగా ఏడ్వడంతో.. భూమయ్య మేల్కొన్నాడు. బాలుడిని కాటేసి వెళ్తున్న రెండు పాములను భూమయ్య గమనించాడు. ఆ రెండు పాములను కర్రలతో కొట్టిచంపాడు. అనంతరం బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశాడు. రుద్రాన్ష్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.