హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర్తీకి నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. చివరిరోజున 96 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో రెండు నామినేషన్లు, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 23 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. 26న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. కాగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలకు వచ్చేనెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జిల్లాల వారీగా రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు తమ పత్రాలు సమర్పించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ సభ్యుల అభ్యర్థిత్వాలను ప్రతిపాదించారు. నామినేషన్లు వేసినవారిలో ప్రస్తుత ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, టీ భానుప్రసాద్రావు, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కొత్తగా మాజీ మంత్రి ఎల్ రమణ, ఎంసీ కోటిరెడ్డి, దండె విఠల్, తాతా మధు, డాక్టర్ వంటేరి యాదవరెడ్డి ఉన్నారు. అక్కడక్కడ కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు, మరికొందరు ఇండిపెండెంట్లు కూడా బరిలోకి దిగారు. జిల్లాల వారీగా కరీంనగర్లో రెండు స్థానాలకు 22, వరంగల్ స్థానానికి 15, నల్లగొండ నుంచి 13, మహబూబ్నగర్లో రెండు స్థానాలకు 4, ఖమ్మం స్థానానికి 3, మహబూబ్నగర్లో రెండు స్థానాలకు గాను 11, రంగారెడ్డిలో రెండు స్థానాలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. కశిరెడ్డి నారాయణరెడ్డి మూడు సెట్లు, దామోదర్రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. వీరి అభ్యర్థిత్వాలను ఒక్కొక్కరికి పది మంది చొప్పునజడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు బలపరిచారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు వాణీదేవి, జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, అబ్రహాం, జెడ్పీ చైర్పర్సన్లు సరిత, వనజ, పద్మావతి, స్వర్ణమ్మ, లోకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు. జిల్లాలో 90 శాతానికిపైగా అధికార పార్టీకి చెందినవారే ప్రజాప్రతినిధులుగా ఉండటంతో.. ప్రతిపక్షాల నుంచి ఎవ్వరూ ఎన్నికల బరిలో దిగే సాహసం చేయలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ మంగళవారం మరోమూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలోని టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, హరిప్రియానాయక్తో కలిసి తాతామధు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ అంగోతు బిందు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వంటేరి యాదవరెడ్డి మరో రెండు సెట్ల నామినేషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావుతో కలిసి దాఖలు చేశారు. నామినేషన్ దాఖలులో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, మాణిక్యరావు, సిద్దిపేట, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, మంజుశ్రీ, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు మంగళవారం మరో సెట్ నామినేషన్లు వేశారు. పట్నం మహేందర్రెడ్డిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, దయానంద్గుప్తా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి బలపర్చారు. శంభీపూర్ రాజు నామినేషన్ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బలపర్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దండె విఠల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు విఠల్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో కలిసి ఆయన నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీఆర్ఎస్కు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండటంతో దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగారు. ఏడాది క్రితం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన కవిత మరోసారి తిరిగి పోటీ చేస్తుండడంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిజామాబాద్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చారు. కవిత తరఫున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. గత ఉప ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండిపోయాయి. అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు వెదికినప్పటికీ చివరి వరకు ఏ ఒక్కరూ పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో జాతీయ పార్టీలు చేతులెత్తేశాయి. రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లతో కలిసి కవిత నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు కవిత తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు తొలి సెట్ నామినేషన్ వేశారు. రెండో సెట్ నామినేషన్ను ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ దాఖలు చేశారు. మూడో సెట్ నామినేషన్ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ వేశారు.
రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీకి, పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఈ సంవత్సర కాలంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల కోసం అనేక కార్యక్రమాలు చేపటాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 90శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి ఇచ్చిన అవకాశాన్ని జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులంతా సహకరించాలని కోరుతున్నాను.
–కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానాల నుంచి టీ భానుప్రసాద్రావు, ఎల్ రమణ నామినేషన్లు వేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి ఎంపీ బీ వెంకటేశ్ నేతకానితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు వారి అభ్యర్థిత్వాలను బలపరిచారు. అభ్యర్థి ఎల్ రమణ మాట్లాడుతూ తాను పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్ : దండె విఠల్
వరంగల్ : పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
ఖమ్మం : తాతా మధుసూదన్
మెదక్ : డాక్టర్ వంటేరి యాదవరెడ్డి
నల్లగొండ : మంకెన కోటిరెడ్డి
మహబూబ్నగర్ : కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకుళ్ల దామోదర్రెడ్డి
రంగారెడ్డి : పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు
కరీంనగర్ : భానుప్రసాదరావు,ఎల్ రమణ