హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటాలని, బతికించాలని విన్నపం చేస్తే వింటలేరనే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో కఠిన నిబంధనలు పొందుపరిచామని సీఎం కేసీఆర్ చెప్పారు. అధికారుల ఉద్యోగాలు, ప్రజాప్రతినిధుల పదవులు ఊడిపోతాయని హెచ్చరించడంతో ఇప్పుడు హరితహారంలో నాటిన మొక్కల్లో 90% బతికాయన్నారు. ఉద్యోగుల జీతాలు, గ్రామ కార్యదర్శుల విధులు, విలీన గ్రామాలకు నిధుల కేటాయింపులోనూ స్పష్టమైన నిబంధనలు పొందుపరిచామని గురువారం అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై స్వల్పకాల చర్చలో కేసీఆర్ చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
లక్ష్యాన్ని సాధించేందుకే నిబంధనలు
మొక్కలు పెంచాలని నోటి మాటలు చెప్తే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే 2018లో తెచ్చిన చట్టాల్లో 85% మొక్కలు బతుకకపోతే మున్సిపాలిటీలో కమిషనర్ ఉద్యోగం, పంచాయతీలో కార్యదర్శి ఉద్యోగంతోపాటు మేయర్, కౌన్సిలర్, చైర్మన్, సర్పంచ్ల పదవులు పోతాయని పెట్టినం. దేశంలోనే మొదటిసారి స్థానిక సంస్థల కోసం ‘కలెక్టర్ లోకల్ బాడీస్’ పోస్ట్ను పెట్టి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో చాంబర్స్ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించినం. దేశంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇవన్నీ చేసిన తర్వాత పెట్టిన మొక్కల్లో 90% బతికున్నయి. బాధ్యత కల్గిన ప్రభుత్వంగా మంచి సలహాలు స్వీకరిస్తాం. జరిగే మంచిని ప్రశంసిస్తారని ఆశ ఉండేది. ప్రతిపక్షాల ప్రశంసలతో వేల సంఖ్యలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు సంతోషిస్తారు. సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. రఘునందన్రావు అద్భుతమైన స్పీచ్ చెప్పారు. వింటుంటే నాకే ఒక కలలా అనిపించింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో జరుగుతున్నది.
ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించాం
అతి చిన్న గ్రామ పంచాయతీ, ఆదాయం లేని గ్రామ పంచాయతీకీ నిధులు రావాలనే ఉద్దేశంతో పూల్ విధానం పెట్టి, ఆదాయాన్ని ఒక్క దగ్గరకు చేర్చి, తిరిగి పంచుతున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.5 లక్షల నిధులు అందేలా చర్యలు తీసుకున్నాం. కాంగ్రెస్ హయాంలో 8,690 గ్రామ పంచాయతీలుండేవి. కానీ పంచాయతీ కార్యదర్శులు 3,414 మందే ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తండాలకు, గూడేలకు పంచాయతీ హోదా కల్పించడంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. నేడు గ్రామపంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది. 9,355 పోస్టులు కొత్తవి మంజూరు చేసి ప్రతి గ్రామానికి కార్యదర్శిని పెట్టినం. ఇలా దేశంలో మరెక్కడా లేదు. కార్యదర్శులుగా పనిచేస్తున్నవారిలో అధికసంఖ్యలో మహిళలున్న నేపథ్యంలో, వారు ప్రసూతి సెలవుపై వెళ్లినప్పుడు ఆ పోస్టు ఖాళీగా ఉండకూడదని ప్రభుత్వం భావించింది. ఆ మహిళా కార్యదర్శి తిరిగి విధుల్లో చేరే మధ్యకాలంలో సేవలందించేందుకు తాతాలిక పద్ధతిన నియమించుకునే అధికారాన్ని కలెక్టర్లకు కల్పించినం. 32 జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు ఉన్నరు. దీనివల్ల పరిపాలన సమర్థవంతంగా జరగడమేగాక, ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నయి. నిధులు కూడా అట్లాగే విడుదల చేసుకుంటున్నాం. ఏదైనా మొండి పట్టు పడితే తప్ప సాధ్యంకాదు. కాంగ్రెసోళ్లు మొక్కలు పెట్టలే, అభివృద్ధి చేయలే. మేం రెండూ చేస్తున్నాం. వాళ్ల కాలంలో మంచి నీళ్లకు దిక్కులేదు. ఒక్కొక్కరు 15-16 బోర్లు వేసేటోళ్లు. ఊరికి పోదామంటే నీళ్ల గొడవ ఉండేది. బిందెలు అడ్డం పెట్టేటోళ్లు. ఇయ్యాల బిందెల ప్రదర్శన బందైంది.
ఠంచన్గా స్థానిక సంస్థలకు నిధులు
గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.227 కోట్లు ఇస్తున్నాం. కేంద్రం డబ్బులు ఒక్కోసారి ఆలస్యం చేసినా, ప్రతి నెల మీరు విడుదల చేసి, తర్వాత రీయింబర్స్ చేసుకోవాలని ఫైనాన్స్ శాఖకు చెప్పిన.
మంచి మెచ్చుకునే పద్ధతి రావాలే
గ్రామాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో మంచి వికాసం జరుగుతున్నది. మొత్తం జరిగిపోయిందని అంటలేం. ఇంకా చాలా జరగాల్సి ఉన్నది. మంచిని మంచి అని ఒప్పుకొనే ఓ మంచి పద్ధతి శాసనసభకు రావాలి. అప్పుడు సభ ఔన్నత్యం పెరుగుతది. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడుతం అంటే కుదరదు. గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నయి. వీళ్లను మరింత ప్రోత్సహించి ఇంకా చేయాలని కోరుతున్నా. గ్రీన్ఫండ్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నయి. ఇది కూడా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడుతది. ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకు పోదాం. మంచిని ప్రశంసించి.. ప్రోత్సహిస్తే మరింత మంచి జరుగుతది.. రాష్ర్టానికి మేలు జరుగుతది. ‘ఎక్కడైనా మొక్కలు చనిపోయినా, సరైన పద్ధతిలో చేయకున్నా వాటిని మా దృష్టికి తీసుకురండి. వెంటనే చర్యలు తీసుకుంటాం. వెరసి అందరం కలిసి రాష్ర్టాన్ని ముందుకు తీసుకొని పోదాం.
ప్లాన్ యువర్ విలేజ్
తెలంగాణ ఏర్పడేనాటికి గ్రామాలను, పట్టణాలను ఒక క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకున్నది లేదు. బడ్జెట్ ఎలా ఖర్చు చేయాలి? అనే స్పష్టమైన విధివిధానాలు లేవు. అందుకే నేను ‘ప్లాన్ యువర్ విలేజ్’ అని నినాదం ఇచ్చాను. గతంలో కారోబార్ దయతోనే అక్కడి వర్కర్లకు మూడు నాలుగు నెలలకు జీతాలు వచ్చేవి. ఇప్పుడు విధిగా ఖర్చుపెట్టాల్సిన డబ్బులకు సంబంధించి గ్రామ పంచాయతీచట్టంలో, మున్సిపాలిటీ చట్టంలో చార్జ్డ్ అకౌంట్లు ఏర్పాటు చేశాం. గ్రామపంచాయతీలో, మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నా లేకున్నా.. వర్కర్స్కు ముందు జీతాలు ఇవ్వాలని పెట్టాం.
దళిత, గిరిజన వాడలకు న్యాయం చేస్త
దళిత, గిరిజన ఎమ్మెల్యేలు తరుచుగా మా తండాకు రోడ్లు వేయమని అడుగుతారు. గిరిజనులు, దళితులకు నిర్లక్ష్యానికి గురైన భావన కలగడం మంచింది కాదు. సబ్ప్లాన్లో డబ్బు ఉంది. చట్టం తెచ్చినం. క్రమం తప్పకుండా ఖర్చు చేస్తున్నాం. దళితవాడల్లో ఆర్థిక దరిద్రం పోవడంతో పాటు మౌలిక సదుపాయాలు రావాలి. దళిత వాడలు, గిరిజన వాడల అభివృద్ధికి పూర్తి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని చెప్పినం. దాదాపుగా రిపోర్టు తయారైంది. ఒకటి లేదా రెండేళ్లలో పూర్తి చేసుకుందాం. దళిత, గిరిజన వాడల్లో ప్రభుత్వమే పూర్తిగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. వారికి అనాదిగా నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం చేయాలి. ఆ పనికి నేనే బాధ్యత వహిస్తా.