పెద్దపల్లి, మార్చి 8 రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రాత్రి వర కు ముగ్గురిని ప్రాణాలతో కాపాడగా, నలుగురు శిథిలాల కిందనే ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం కార్మి కుడు వీరవేన రవీందర్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. కాగా రాత్రి 11 గంట లకు డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహం లభించగా.. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ కోసం ఆపరేషన్ కొనసాగుతున్నది. తనకు సమీపంలోనే మిగతా వారు ఉన్నట్టు రవీందర్ చెప్పడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. బొగ్గు భారీగా పేరుకుపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి.
సహాయక చర్యలు వేగవంతం : కొప్పుల
శిథిలాల్లో చిక్కుకొన్న కార్మికులను రక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి మంత్రి అడ్రియాల గనిని సందర్శించారు. గనిలోకి దిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొన్నారు.