లింగంపేట/ నిజాంసాగర్, మే 1: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సైతం గుజరాత్కు తరలించిందని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరుచేస్తే రాష్ర్టానికి ఒక్కటీ కేటాయించలేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిజాంసాగర్లో 882 మందికి దళితబంధు యూనిట్లను పంపిణీచేశారు. లింగంపేట సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం విస్మరించిందని అన్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించడంతో ఇక్కడి నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటును పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నిజామాబాద్లో ఏర్పాటు చేస్తానన్న పసుపుబోర్డు ఏమైందని నిలదీశారు. బెంగళూర్ మెట్రోకు రూ.40 వేల కోట్లు వెచ్చించిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోకు ఒక్క రూపాయి కేటాయించలేదని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ అని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. సీఎం కేసీఆర్పై బురద చల్లేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ 3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. కేంద్రం నుంచి తెలంగాణకు కేవలం 1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టంచేశారు. తెలంగాణ నిధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు మళ్లించారని ఉద్ఘాటించారు. తెలంగాణకు రూ.2 వేల కోట్ల బీఆర్జీఎఫ్ నిధులు, రూ.3వేల కోట్ల ఫైనాన్స్ నిధులు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఎంపీ పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
946 మందికి 882 దళితబంధు యూనిట్లు..
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకంతో దేశంలో అగ్గి పుడుతున్నదని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన 946 మంది దళితబంధు లబ్ధిదారులకు 882 యూనిట్లను నిజాంసాగర్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారంచుట్టారని.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు యజమానులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. తెలంగాణ తరహా పథకాలు తమకూ కావాలని పలు రాష్ర్టాల ప్రజలు అక్కడి పాలకులను డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సరిహద్దుల్లోని కర్ణాటక, మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు గుర్తుచేశారు.