సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా 16 శాతమే. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మికులకు 20 శాతం వాటాను మాత్రమే ప్రకటించారు. కానీ.. స్వరాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా ఎన్నడూ 21 శాతం కంటే తగ్గలేదు. సంస్థకు తక్కువ లాభాలు వచ్చినా కేసీఆర్ మాత్రం కార్మికుల వాటా శాతాన్ని పెంచుతూనే వచ్చారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సమ్మెల వల్ల నష్టాల్లో నడిచిన సింగరేణి సంస్థలో కార్మికులు పడ్డ బాధలన్నీ సొంత రాష్ట్రంలో పటాపంచలయ్యాయి. అప్పుడు ఆర్థిక దిగ్బంధనంలో నడిచిన సంస్థ నేడు కార్మికుల స్వేదంతో ఆర్థికంగా బలోపేతమై వ్యాపారంలో తలెత్తుకుని పరుగులు తీస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం వల్లనే సింగరేణి కార్మికుల బంగారు భవిష్యత్తుకు పునాది పడింది. అందుకు నిదర్శనం గత పదేండ్ల గణాంకాలే.
ఇప్పుడు రెట్టింపు శాతం వాటా
సమైక్య పాలకుల హయాంలో 2008-09 నుంచి 2010-11 వరకు వరుసగా మూడేండ్లపాటు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమే. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మికులకు 20 శాతం వాటాను మాత్రమే ప్రకటించారు. కానీ.. స్వరాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా ఎన్నడూ 21 శాతం కంటే తగ్గలేదు. కొవిడ్ సంక్షోభంతోపాటు ఇతర కారణాల వల్ల సింగరేణికి ఒకట్రెండు సార్లు తక్కువ లాభాలు వచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల వాటా శాతాన్ని క్రమంగా పెంచుతూనే వచ్చారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించారు. దీన్ని బట్టే సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు ఎంత ఆప్యాయత ఉన్నదో అర్థం చేసుకోవచు.
గతంలో రూ.100 కోట్లు దాటిందే లేదు
సమైక్య రాష్ట్రంలో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇచ్చిన మొత్తం వాటా ఎన్నడూ రూ.100 కోట్లు దాటిందే లేదు. 2008-09లో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 16 వాటా ప్రకటించిన అప్పటి ప్రభుత్వం.. మొత్తంగా వారికి చెల్లించిది మాత్రం రూ.21.25 కోట్లే. తెలంగాణ ఏర్పడిన 2013-14లో కూడా పేరుకు 20 శాతం వాటాను ప్రకటించినప్పటికీ కార్మికులకు పంచింది రూ.83.75 కోట్లు మాత్రమే.
తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలోనేకార్మికులకు రూ.102.99 కోట్లు చెల్లింపు
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించారు. తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించడంతో తొలిసారి అది మూడంకెల మార్కు దాటింది. నాడు కార్మికులకు ఏకంగా రూ.102.99 కోట్లు వాటాగా చెల్లించారు. నాటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కార్మికులకు రూ.100 కోట్లలోపు వాటా చెల్లించారు. కొవిడ్ సంక్షోభం, ఇతర కారణాల వల్ల సింగరేణి లాభాలు గణనీయంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా శాతాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ తగ్గించకపోగా ఎప్పటికప్పుడు పెంచుతూనే వచ్చింది. అలా 2016-17లో 25 శాతం, 2020-21లో 30 శాతం వాటాను పంచిన ప్రభుత్వం.. 2022-23లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించింది. దీంతో ఈసారి కార్మికులకు మొత్తం రూ.711.19 కోట్లు చెల్లించనున్నారు.
అప్పుడు నాలుగింతలు.. ఇప్పుడు ఏడింతలు
2008-09లో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు వాటాగా రూ.21.25 కోట్లు చెల్లించారు. ఈ వాటా 2013-14 నాటికి 4 రెట్లు పెరిగి రూ.83.75 కోట్లకు చేరింది. కానీ, తెలంగాణ ఆవిర్భవించాక తొలి ఏడాది (2014-15)లో కార్మికులకు లాభాల వాటాగా రూ.102.99 కోట్లు చెల్లించిన సింగరేణి సంస్థ.. 2022-23 లాభాల్లో మొత్తం రూ.711.19 కోట్లు చెల్లించనున్నది. అంటే గత తొమ్మిదేండ్లలో కార్మికుల లాభాల వాటా ఏకంగా 7 రెట్లు పెరిగింది. సమైక్య పాలకుల హయాంలో సింగరేణి లాభాల నుంచి వాటాగా ఒక్కో కార్మికుడికి రూ.10 వేలు మించి దక్కేవి కాదు. కానీ, ఇప్పుడు స్వరాష్ట్రంలో ఒక్కో కార్మికుడికి సగటున ఏకంగా రూ.1.65 లక్షలకుపైగా చెల్లిస్తుండటం గమనార్హం.
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఆర్థికంగా సింగరేణి పరిపుష్ఠం
సింగరేణి సంస్థ పట్ల, కార్మికుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను సీఎం కేసీఆర్ మొదటి నుంచే చాటుకుంటున్నారు. అందులో భాగంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి, ఆ సంస్థ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. సమర్థుడైన ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ సారథ్యంలో సింగరేణి అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా మార్గదర్శనం చేస్తున్నారు. అరకొర జీతాలు, కాలే కడుపులతో అలమటిస్తున్న కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని, ఎప్పటికప్పుడు పరిష్కరించారు. ఫలితంగా కార్మికులు సమ్మె బాటను వీడి బొగ్గు బాయిల బాట పట్టడంతో సింగరేణి లాభాల్లో పెరుగుదల మొదలైంది. ఇదే సమయంలో సంస్థ కూడా బొగ్గు తవ్వకాలను మరింత విస్తృతం చేయడంతోపాటు విభిన్న వ్యాపారాలను చేపట్టడం.. థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తిలోకి ప్రవేశించడంతో లాభా లు మరింత పెరిగాయి. దీంతో 2008-09లో కేవలం రూ.132.83 కోట్లుగా ఉన్న సింగరేణి లాభాలు 2022-23లో ఏకంగా రూ.2,222.46 కోట్లకు చేరాయి.
అప్పట్లో సంస్థ లాభాల కంటే ఇప్పుడు కార్మికులకు పంచేదే ఎక్కువ
సమైక్య పాలకుల హయాంలో సింగరేణికి వచ్చే లాభాలు చాలా తక్కువగా ఉండేవి. 2013-14లో రూ.418.74 కోట్ల లాభం రావడమే అప్పట్లో ఘన చరిత్ర. దీని కంటే స్వరాష్ట్రంలో లాభాల వాటాగా సింగరేణి కార్మికులకు పంచుతున్న మొత్తమే చాలా అధికంగా ఉండటం గమనార్హం. 2018-19లో రూ.1,763.66 కోట్ల లాభాలను గడించిన సింగరేణి.. అందులో కార్మికులకు 28 వాతం వాటాగా మొత్తం రూ.493.82 కోట్లు చెల్లించింది. ఇప్పుడు ఏకంగా రూ.711.19 కోట్లు చెల్లించనున్నది. ఇది 2011-12లో సింగరేణికి వచ్చిన లాభాల కంటే రెట్టింపు.
సీఎం మార్గదర్శనం, కార్మికుల శ్రమే కారణం
సీఎం కేసీఆర్కు మొదటి నుంచే సింగరేణి అంటే ఎంతో అభిమానం, ఆప్యాయత. అందుకే స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచే సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. కార్మికుల కష్టాలను పరిష్కరించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో కార్మికులు ‘మా రాష్ట్రం.. మా సంస్థ’ అనుకొని క్రమశిక్షణతో వ్యవహరించడం, తీవ్రంగా శ్రమించడంతో సింగరేణి పరిస్థితి మెరుగుపడింది. దీనికి తోడు కొత్త వ్యాపారాల్లోకి దిగడంతో ఆర్థికంగా సంస్థ మరింత బలపడింది. అందుకే రూ.11 వేలకోట్ల టర్నోవర్ రూ. 32 వేలకోట్ల టర్నోవర్ను అవలీలగా అధిగమించగలిగాం. రానున్న ఐదేండ్లలో మరింత పకడ్బందీగా ముందుకుసాగి రూ.50 వేలకోట్ల టర్నోవర్ను చేరుకుంటాం. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఉదారతతో వ్యవహరిస్తున్నారు. సింగరేణి లాభాల్లో ఈసారి కార్మికులకు 32 శాతం వాటా చెల్లించాలని నిర్ణయించారు. దీంతో సంస్థ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కార్మికులకు మొత్తం రూ.711.19 కోట్లు చెల్లిస్తున్నాం. దీనికంతటికి సీఎం కేసీఆర్ మార్గదర్శనం, కార్మికుల శ్రమే కారణం. ఇదే ఒరవడితో కార్మికులు ముందుకు సాగాలని, ఆర్థికంగా సింగరేణిని దేశంలోనే అత్యంత బలమైన ప్రభుత్వరంగ సంస్థగా నిలబెట్టాలని ఆశిస్తున్నాను.
– ఎన్ శ్రీధర్, సింగరేణి సీఎండీ