సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా ప్రక్రియ వల్ల గ్రేటర్ వ్యాప్తంగా పాలన పడకేసింది. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ అధికారిక విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామంటూ పాలనా పరమైన పనులను పక్కకు పెడుతున్నారని నగర ప్రజలు వాపోతున్నారు. సర్ విధుల్లో ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి దాకా అన్నిరకాల ఉద్యోగులు ఈ ప్రక్రియలో భాగమయ్యారు. దీంతో నగర ప్రజలు తమ పనుల కోసం వెళ్తే ఏ అధికారి కూడా అందుబాటులో ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఏ పనుల కోసం వెళ్తున్నా ఆగస్టు 3 దాకా సర్ నమోదు ప్రక్రియ సాగుతుందని, ఆ పనుల్లో బిజీగా ఉన్నామని ఆ తర్వాతే రావాలని పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో బాధితులు వెనుదిగిరి పోతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం రోజువారీ పాలనాపరమైన విధులతో పాటు సర్ ప్రక్రియను కొనసాగించాలని చెప్తున్నారు. అధికారులు మాత్రం ఇదే అదనుగా సర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామని విధులను తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పూర్తిస్థాయిలో సర్ విధుల్లోనే ఉండాలని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు జిల్లా అధికారులే నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండటం లేదు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఆహారం పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మందకొడిగానే సర్ ప్రక్రియ
ప్రభుత్వ అధికారులు సర్ విధుల్లో బిజీగా ఉన్నామని చెప్తున్నా.. ఓటర్ల వివరాల నమోదు, డిజిటలీకరణ మాత్రం మందకొడిగానే సాగుతున్నది. అధికారులు పూర్తిస్థాయిలో సర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని చెప్తున్నా గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా డిజిటలైజేషన్ మాత్రం 50 శాతం దాటడం లేదు. అధికారులు లేకపోవడంతో గ్రేటర్ వ్యాప్తంగా మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సర్ పేరిట అసలు కార్యాలయాలకు రావడమే మానేశారనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో అటు పౌర సేవలను నిర్లక్ష్యం చేస్తూ.. ఇటు సర్ ప్రక్రియ వేగవంతం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 50.73 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి 54.89 శాతం, రంగారెడ్డి జిల్లాలో 59.21 శాతం మాత్రమే డిజిటలీకరణ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులేమో పూర్తిస్థాయిలో సర్పై దృష్టిసారించామని చెప్తుంటే గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా 60 శాతం కూడా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్ విధులతో పాటు అధికారిక విధులపై కూడా ఉద్యోగులు దృష్టిసారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.