హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం, దానినే ఎన్నికలకు ఇంధనంగా మార్చుకోవడం బీజేపీ విధానమని మరో అధ్యయనం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఇది మితిమీరుతున్నట్టు అంతర్జాతీయ స్థాయి నివేదిక ఘోషించింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హిందుత్వ వాచ్’ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు విద్వేష ప్రసంగాలపై దేశంలోని 17 రాష్ర్టాల్లో 255 కేసులు నమోదయ్యాయి. వీటిలో 205 కేసులు(80%) బీజేపీ రాష్ర్టాల్లోనే వెలుగుచూడటం గమనార్హం. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులు 2020 నాటికే 500% పెరిగాయని నివేదిక లెక్కతీసింది. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హలాల్ జిహాద్, వ్యాపార్ జిహాద్ వంటి పదాలను సృష్టించిన బీజేపీ హిందుత్వ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సమయంలో వీటిని ఉపయోగిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ ఏడాది నమోదైన విద్వేష కేసుల్లో 70% వరకు 2023, 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో వెలుగు చూశాయని నివేదిక తెలిపింది. కర్ణాటక ఎన్నికలకు రెండేండ్ల ముందు నుంచి అక్కడ 68 విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. నమోదు కాని ఘటనలు ఇంతకన్నా రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అంచనా. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి నుంచి 2023 ఏప్రిల్ మధ్య 385 క్రిమినల్ కేసులను మాఫీ చేసింది. బీజేపీ, సంఘ్పరివార్కు చెందిన దాదాపు 1,000 మందిపై కేసులు ఎత్తివేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఎన్నికలకు ఒకటి రెండేండ్ల ముందు నుంచే విద్వేష ప్రణాళిక అమలు చేసినట్టు గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నది. తెలంగాణలోనూ బీజేపీ నేతలు విద్వేష వ్యాఖ్యలు చేయడంలో ఆరితేరారు. చివరకు తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీదనే వేటు వేయకతప్పని పరిస్థితి బీజేపీకి ఎదురైంది.