ACB | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడానికి అధికారులు భయపడేవాళ్లు. ప్రభుత్వ మారడంతో కొందరు అధికారులు మళ్లీ లంచాల అవతారమెత్తుతున్నారు. దొరికినకాడికి దండుకుంటున్నారు. ఇటు లంచాలు ఇవ్వలేక, అటు పనులుగాక చాలా మంది ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో పట్టుకుంటున్నారు.
కోర్టుకు సమర్పించేందుకు రహస్యంగా వీడియోలు సైతం తీస్తున్నారు. అరెస్టులతో సరిపెట్టకుండా వెంటనే వారి ఆస్తులు, బినామీల వివరాలు ఆరా తీస్తున్నారు. వెనువెంటనే సోదాలు కూడా చేపడుతున్నారు. లంచాధికారులు అక్రమంగా సంపాదించిన డబ్బులు, బంగారం, భూములు, స్థిర, చరాస్తులను లెక్కకట్టి కోర్టుకు వివరిస్తున్నారు. పక్కా ఆధారాలు సమర్పించడంతో కోర్టు సైతం శిక్షలు విధిస్తున్నది. ఐదు నెలల్లో 70 మంది అధికారులు ఏసీబీకి చిక్కగా.. అందులో 5 కేసులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న కేసులున్నాయి.