హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు 24 గంటలూ నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు పొందుతుంటే.. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మాత్రం 7 గంటల విద్యుత్తు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఎండిన వరి మొక్కలను ప్రదర్శిస్తూ విద్యుత్తు కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. గురువారం చిత్రదుర్గ, రాయ్చూర్, మైసూర్ తదితర ప్రాంతాల్లోని విద్యుత్తు కార్యాలయాలు రైతుల ఆందోళనలతో దద్దరిల్లాయి. కర్ణాటక స్టేట్ ఫార్మర్స్ అసోసియేషన్, గ్రీన్ సేనా వర్కర్స్ ఆధ్వర్యంలో విద్యుత్తు పంపిణీ కార్యాలయాల ఎదుట ధ ర్నా నిర్వహించిన రైతులు, రోడ్డుపై బైఠాయించి రాకపోకలను స్తంభింపజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాపూరు తిమ్మప్ప అనే రైతు పురుగుమందు తాగడంతో ఆయనను దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే శివరాజ్పాటిల్ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. విద్యుత్తు సరఫరా సరిగా లేకపోవడంవల్ల పంటలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ, ఎండిపోయిన వరి మొక్కలను ప్రదర్శించారు. విద్యుత్తు శాఖ ఈఈ ఆందోళనకారులతో మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్తు సరఫరా చేసే అవకాశం లేదని, తాము 3 గంటలకన్నా ఎక్కువ కరెంటు ఇవ్వలేమని స్పష్టంచేశారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురై రోడ్డుపై బైఠాయించారు.
చిత్రదుర్గలో రైతులు తలపై సద్ది మూటలు పెట్టుకొని విద్యుత్తు పంపిణీ కార్యాలయం ముందు వినూత్న నిరసన తెలిపారు. రైతు దేశానికి అన్నం పెట్టాలంటే కరెంటు ఇవ్వాల్సిందేనని నినదించారు. రైతు సంఘం నాయకులు బసవారెడ్డి మాట్లాడుతూ.. ఏడు గంటల విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దానిని విస్మరించి రైతులను ముంచిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు.
మైసూరులో విద్యుత్తు పంపిణీ కార్యాలయం ముందు రైతులు టెంటు వేసుకొని రిలే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల హామీ ప్రకారం ఏడు గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేవరకు తాము ఆందోళనలు విరమించేదిలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ తమను నట్టేట ముంచిందని, పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.