9 లక్షల రిజిస్ట్రేషన్లు, 2.5 లక్షల గిఫ్ట్డీడ్లు
33 మాడ్యూల్స్తో చాలా సమస్యల పరిష్కారం
ధరణి ముందు తప్పిదాలతో చిన్న సమస్యలు
పరిష్కారానికి ములుగులో పైలట్ ప్రాజెక్టు
ధరణితో రైతుల భూములకు పక్కా భద్రత
ఆర్థిక మంత్రి హరీశ్రావు, సీఎస్ సోమేశ్
ములుగులో రైతులకు అవగాహన సదస్సు
గజ్వేల్, జూన్ 14: భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించుకొన్నారని చెప్పారు. ధరణి పోర్టల్తో 96% మందికి ప్రయోజనం కలిగిందని.. మిగతా 4% మంది.. ధరణి రావడానికి ముందు జరిగిన తప్పిదాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగులోని రైతువేదికలో ధరణి పోర్టల్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి హరీశ్రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. ములుగు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసుకొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములను దశాబ్దాలుగా దున్ని అనుభవిస్తున్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం, ఎల్ఆర్ యూపీ దార్వా కొన్ని భూ సమస్యలు మిగిలిపోయాయని వెల్లడించారు. ధరణి పోర్టల్ ఏర్పాటుకు ముందు ఎల్ఆర్యూపీలోని కొన్ని భూసమస్యలు ధరణిలో రికార్డు కాకపోవడం వల్ల అవాంతరాలు ఎదురయ్యాయని, మరికొన్ని సమస్యలు తప్పుగా నమోదు కావడం సమస్యలకు కారణమైందని వివరించారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలన్నదే ఈ సదస్సు ఉద్దేశమని చెప్పారు. ధరణిలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని, ములుగు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని.. అధికారులు స్థానికంగానే ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని తెలిపారు. కోర్టు కేసులు, వ్యక్తిగత సమస్యలు లేని ఇతర భూ సమస్యను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు మండలంలో వందశాతం సమస్యలు పరిష్కరించి రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ములుగు తర్వాత ఇదే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులెవరూ సమస్యల పరిష్కారం కోసం పైరవీకారులను ఆశ్రయించవద్దని, డబ్బులు ఇవ్వొద్దని మంత్రి హరీశ్రావు సూచించారు.
ధరణితో భూములకు భద్రత: సీఎస్ సోమేశ్కుమార్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎవరైనా పేర్లు, భూముల వివరాలు మార్చడానికి వీలుండేదని, ఇప్పుడు ఖాతాదారు బొటనవేలు పెడితేనే సాధ్యమవుతుందని చెప్పారు. ధరణిని ప్రారంభించిన నాటి నుంచి 7 కోట్ల మంది వినియోగించారని, 33 మాడ్యూల్స్తో చాలా సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు, రెండున్నర లక్షల గిఫ్ట్ డీడ్లు పూర్తయ్యాయన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి శాసనసభ సబ్కమిటీ చైర్మన్గా ఉన్న మంత్రి హరీశ్రావు సహకారంతో ధరణిలోని చిన్నచిన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ములుగులో వచ్చిన దరఖాస్తులను ఇక్కడే పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. సదస్సు అనంతరం సంబంధితశాఖల అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్షా నిర్వహించారు. ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి, వాటిలో టెక్నికల్గా, క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న అంశాలపై చర్చించారు. వివిధ అంశాలపై పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలనే అంశంపై సమాలోచన చేశారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో 186, ములుగు మండలంలో 46 ఫిర్యాదులను గుర్తించినట్టు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి వివరించారు. సమీక్షలో సీఎంవో కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఐటీశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ములుగు ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఎంపీపీ పెద్దబాల్ లావణ్య అంజన్గౌడ్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్రెడ్డి, పీఏసీఎస్, ఏఎంసీ వైస్ చైర్మన్లు నరేశ్గౌడ్, భూపాల్రెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.