ముప్కాల్/వేల్పూర్, ఆగస్టు 27: పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో ఆదివారం రూ.7.62 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లే కదా అప్పుడు ఎందుకు రూ.4 వేల పెన్షన్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. అప్పుడు ఇవ్వనోడు ఇప్పుడు ఇస్తానంటే ఎట్లా నమ్ముతామని అన్నారు. కేంద్రంలో తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ..
వాళ్ల పాలిత రాష్ర్టాల్లో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. బీజేపీ మాటలు అన్ని అబద్ధాలేనని, అంతా ‘అర్వింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు కథే’ అని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 3గంటల కరెంటు చాలంటున్నాడని, మళ్లీ పాత రోజులే కావాలా? అని రైతులను ఉద్దేశించి అన్నారు. తనను 9 ఏండ్లుగా విమర్శించని కాంగ్రెస్, బీజేపీ నేతలు రెండు నెలలుగా ఎందుకు బురద జల్లుతున్నరో ప్రజలే ఆలోచన చేయాలని కోరారు. తన తండ్రి, రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వేల్పూర్ గ్రామ సమీపంలోని సురేందర్రెడ్డి స్మృతివనంలో రైతు నాయకులు, అభిమానులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేల్పూర్ ఎక్స్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.