హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా కేసీఆర్కు ఆదరణ ఉన్నదని.. అయినా ఓటమి తప్పలేదని ‘ది హిందూ’ పత్రిక విశ్లేషించింది. ఎస్సీలు, ఆదివాసీలు, ముస్లింలు, కొన్ని అగ్రవర్ణ కులాలు, కొన్ని ఓబీసీ కులాల్లో కాంగ్రెస్తో పోల్చితే బీఆర్ఎస్కే మద్దతు ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నది. కేంద్రంలోని బీజేపీ పాలనతో పోల్చితే బీఆర్ఎస్ పాలనకు ఓటేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు వెల్లడించింది. ఓటర్లలో 36 ఏండ్లకు పైబడినవారిలో ఎక్కువ మంది సీఎంగా కేసీఆర్ మరోసారి రావాలని కోరుకున్నారని, యువతలో మాత్రం సీఎంగా ఎక్కువమంది రేవంత్రెడ్డి కావాలన్నారని తెలిపింది. అంతిమంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని చూసే ఓటు వేస్తామని ఎక్కువ మంది చెప్పినట్టు పేర్కొంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించడంలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కాస్త ముందున్నట్టు తెలిపింది. చివరగా.. బీఆర్ఎస్కు ఆదరణ ఉన్నా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, బీజేపీ సైతం ఓటుబ్యాంకును చీల్చడంతో ప్రభావం కనిపించినట్టు తెలిపింది. లోక్నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు హిందూ పేర్కొన్నది. దీని ప్రకారం..
సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలు
పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాల్లో తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్తు, రైతు పథకాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల పెరుగుదల, పేదరిక నిర్మూలనకు చేపట్టిన పథకాలు అత్యధిక ప్రజాదరణ పొందినవిగా పేర్కొన్నది.
సామాజికవర్గాల వారీగా దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకున్నా, వర్గీకరణ అంటూ హడావుడి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ పార్టీకి అగ్రవర్ణాల్లోనే ఆదరణ ఎక్కువగా ఉన్నది.
సామాజికవర్గాల వారీగా ఆయా పార్టీలను కోరుకున్నవారు..(ప్రతి 100 మందిలో)
వయసుల వారీగా పరిశీలించినప్పుడు యువ ఓటర్లు రేవంత్రెడ్డివైపు చూడగా, మధ్య వయస్కులు, వృద్ధులు కేసీఆర్ కావాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో విద్యుత్తు, తాగు, సాగు నీటి సరఫరా, రోడ్లు బాగుపడ్డాయని.. అనేక అంశాల్లో రాష్ట్రం మెరుగుపడిందని మెజార్టీ ప్రజలు పేర్కొన్నట్టు ‘ది హిందూ’ పత్రిక విశ్లేషించింది. వీరిలో 40-50% మంది బీఆర్ఎస్కు ఓటేశామని చెప్పగా.. 30-40% మంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు.