మెదక్ : మోపెడ్ డిక్కీలో ఉంచిన రూ. 6.70 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంటలో చోటు చేసుకుంది.
మక్క రాజపేట్కు చెందిన చింతల శ్రీదేవి ఎస్బీఐ సర్వీస్ ప్రొవైడర్గా పని చేస్తోంది. అయితే రైతుల ఖాతాల్లో ధాన్యం అమ్మిన డబ్బులు జమ అయ్యాయి. దీంతో డబ్బుల కోసం శ్రీదేవి వద్దకు రైతులు రావడంతో.. బ్యాంక్కు వెళ్లి నగదు తేవాలని కుమారుడికి ఆమె సూచించింది.
ఈ క్రమంలో శ్రీదేవి కుమారుడు మోపెడ్ వాహనంపై చేగుంటలోని ఎస్బీఐ బ్యాంక్కు వెళ్లాడు. అక్కడ రూ. 6.70 లక్షల నగదు విత్డ్రా చేసుకుని ఇంటికి బయల్దేరాడు. కిరాణ సరుకుల కోసమని మోపెడ్ వాహనాన్ని ఆ యువకుడు మధ్యలో ఆపాడు. బ్యాంక్ నుంచి మోపెడ్ వాహనాన్ని ఫాలో అవుతున్న ఇద్దరు దుండగులు.. డిక్కీని పగులగొట్టి నగదును దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.