Sagar Dam | నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్రామ్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. అర్ధరాత్రి నుంచి డ్యామ్పై ఆంధ్రా పోలీసులు తిష్ట వేశారు. 26 గేట్లలో మధ్యలో 13 గేట్ల వద్ద ముళ్ల కంచె, టెంట్లు వేసుకుని పోలీసుల పహారా కాస్తున్నారు. డ్యామ్పై ఏపీ వైపు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దౌర్జన్యంగా కుడి కాల్వకు అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేట్ ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో డ్యామ్ డెడ్ స్టోరేజ్కు చేరుకోనున్నది. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని తెలంగాణ రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు.
అయితే, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్కు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ దాదాపు 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై అడ్డుకున్నారు. మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్ల కంచెను తొలగించాలని సూచించారు. ఇందుకు ఏపీ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక ఆయన వెనక్కి వెళ్లిపోయారు. వాస్తవానికి ఏపీ విభజన సమయంలో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.