హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50 శాతం ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,216 జూనియర్ కాలేజీలుంటే వీటిల్లో 1,602 కాలేజీలు ప్రభుత్వ, 1,571 కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల హవా సాగగా, కొన్నేండ్లుగా సర్కారు కాలేజీల జోరు నడుస్తున్నది. ఏటా గురుకులాలు, కేజీబీవీల అప్గ్రేడేషన్తోపాటు కొత్తగా ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతున్నది. అదే సమయంలో ప్రైవేట్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నది.
రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రైవేట్ కాలేజీకి కూడా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. గతంలో గుర్తిం పు పొందిన కాలేజీలకే ఏటా గుర్తింపును పునరుద్ధరిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 ప్రైవేటు కాలేజీలను గతంలోనే ఇంటర్బోర్డు మూసివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2,600 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలుంటే.. ఈ విద్యాసంవత్సరంలో అవి 1,571 చేరుకున్నాయి. అంటే సుమారుగా వెయ్యికిపైగా కాలేజీలు మూతబడ్డాయి. ఇదే క్రమంలో వెయ్యికిపైగా కొత్త ప్రభుత్వ కాలేజీలు మంజూరయ్యాయి.