హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచీ సర్కారు దవాఖానల అభివృద్ధిపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. వైద్యానికి ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ అన్ని స్థాయిల దవాఖానలను బలోపేతం చేశారు. దీంతో ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా సేవలు అందిస్తున్నాయి. ఇందుకు ఆరోగ్యశ్రీ తాజా గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ. నిరుడితో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో క్లెయిముల సంఖ్య 50 శాతానికిపైగా పెరిగాయి. ఇదే సమయంలో ప్రైవేట్ దవాఖానల నుంచి క్లెయిములు 15 శాతం తగ్గాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి చివరినాటికి రూ.1,044 కోట్ల విలువైన క్లెయిములు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి 11 నెలల్లో ఐదు లక్షల మందికిపైగా లబ్ధి చేకూరినట్టు వెల్లడించాయి.
పేదలకు మరింత చేరువ..వైద్యులకు ప్రోత్సాహం
పేదలకు ఆరోగ్యశ్రీ సేవలను మరింత చేరువ చేయడం, పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పీహెచ్సీలను సైతం ఆరోగ్య శ్రీకి అనుసంధానించింది. ఇది పేదలకు వరంగా మారింది. డీపీహెచ్ పరిధిలోని పీహెచ్సీల నుంచి ఇప్పటివరకు 14,965 క్లెయిములు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఆరోగ్య శ్రీ క్లెయిమ్స్ వివరాలు..
2021-22 ఆర్థిక సంవత్సరంలో డీఎంఈ (టీచింగ్ హాస్పిటళ్లు) పరిధిలోని దవాఖానల్లో 72,225 క్లెయిములు నమోదు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలల్లోనే 1,08,223 క్లెయిమ్స్ వచ్చాయి. ఇది 50 శాతం అధికం. ఈ ఏడాది క్లెయిముల విలువ రూ.250 కోట్లకుపైగా ఉన్నది.
వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని దవాఖానలను పరిశీలించినప్పుడు నిరుడు 66,153 క్లెయిమ్స్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే 99,744 క్లెయిములు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. వీటి విలువ సుమారు రూ.156 కోట్లు. 2021-22తో పోల్చితే క్లెయిములు 51 శాతం ఎక్కువగా రావడం విశేషం.
నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటళ్ల నుంచి ప్రభుత్వానికి 55 వేలకుపైగా క్లెయిములు వచ్చాయి. అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్స వంటి ఖరీదైన వైద్యం ఇక్కడ అందుతున్నది. వీటి కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఇస్తున్న సంగతి తెలిసిందే.