హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ లబ్ధిదారుల వాటా చెల్లింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు లు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న డీడీల విధానానికి స్వస్తి పలికి, లబ్ధిదారులు తమ వాటాను నేరుగా కలెక్టర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంతో లబ్ధిదారులకు రూ.5 కోట్ల వరకు డబ్బు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. తొలి విడతలో రూ.6 వేల కోట్లతో 3.93 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలలో రెండో విడత పంపిణీని ప్రారంభించనున్నది. రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణీకి చర్యలు చేపడుతున్నది. లబ్ధిదారులు వాటాను కొత్త పద్ధతిలో చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇప్పటివరకు 32 వేల మంది లబ్ధిదారులు ఈ విధానంలో వాటా చెల్లించారని అధికారులు తెలిపారు.
లబ్ధిదారులు తమ వాటా సొమ్మును నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసేందుకు అధికారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ప్రతి లబ్ధిదారునికి ఒక వర్చువల్ అకౌంట్ నం బర్ను క్రియేట్ చేశారు. ఈ నంబర్లు ఆయా మండలాల పశు వైద్యాధికారుల వద్ద అందుబాటులో ఉంటాయి. లబ్ధిదారులు ఈ అకౌం ట్ నంబర్ల వివరాలను తెలుసుకొని తమ ఖాతా నుంచి నేరుగా వాటా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అవి జిల్లా కలెక్టర్ అధికారిక ఖాతాలో జమవుతాయి. పూర్తి వివరాలు గొర్రె ల పంపిణీకి సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ ‘ఈ-లాబ్’లో నిక్షిప్తమవుతాయి. వాటి ఆధారంగా వాటా చెల్లింపుదారులను గుర్తించి అధికారులు గొర్రెలను పంపిణీ చేయనున్నారు.
గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఒక్కో యూని ట్ (21 గొర్రెలు) ధరను రూ.1.75 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రూ. 1,31,250 (75%), లబ్ధిదారు రూ. 43,750 (25%) వాటా చెల్లించాల్సి ఉం టుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు తమ వాటాను డీడీల రూపంలో చెల్లించేవారు. దీంతో బ్యాంకులు రూ.50 వేలలోపు డీడీకి అదనంగా రూ.100-150 వరకు చార్జి వసూ లు చేసేవి. ఈ లెక్కన లబ్ధిదారులు తమ వాటా కాకుండా అదనంగా డీడీ చార్జీల కింద దాదాపు రూ.5 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త విధానంతో లబ్ధిదారులకు ఈ రూ.5 కోట్లు ఆదా అవడంతోపాటు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు, పలు ఇతర సమస్యలు తప్పుతాయి.