హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితబంధు, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలవుతున్నది. తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ 5% రిజర్వేషన్ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సొంత జాగ ఉండి, ఇల్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది. తొలివిడతలో నియోజకవర్గానికి రూ.3వేల చొప్పున సీఎం కోటా కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇందులో 20 వేల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది.
దళితబంధు పథకంలో కూడా దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేస్తుండటంతో ఇప్పటివరకు 327 మందికిపైగా లబ్ధిపొందారు. ఉపాధి అవకాశాలను పొందడం కోసం ఒక్కో దళిత దివ్యాంగుడికి రూ.10 లక్షల చొప్పున మొత్తం దాదాపు రూ.32.70 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. దీంతో దివ్యాంగ దళితులు సొంతంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుండటం విశేషం. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎక్కువగా ట్రాక్టర్లను ఎంచుకోగా, అర్బన్ గ్రామీణ ఏరియాలోని దివ్యాంగులు ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు, డీటీపీ, నిర్మాణ సామగ్రి, డెయిరీ, మినీ సూపర్బజార్ల యూనిట్లను ఎంచుకొని ఉపాధి పొందారు.
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులందరి తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగుల సొంతింటి కల నెరవేరనున్నదని ఆనందం వ్యక్తంచేశారు.