హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, టీ జీవన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమానికి 2015లో బీజం వేశారని, తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతున్నదని చెప్పారు. హరితహారంలో 230 కోట్లు మొక్కలు నాటడమే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 283.82 కోట్ల మొకలు నాటినట్టు వివరించారు.
ఈ కార్యక్రమానికి రూ.11,095 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. తొమ్మిదో విడత హరితహారంలో 19.29 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 9.02 కోట్ల మొకలు నాటామని చెప్పారు. 2024 సీజన్లో 20.02 కోట్ల మొకలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రమాదకరమైన కొనోకార్పస్ మొకల పెంపకాన్ని నిషేధించినట్టు తెలిపారు. ‘వానలు వాపస్ రావాలే.. కోతులు వాపస్ పోవాలే’ అనే సీఎం కేసీఆర్ నినాద స్ఫూర్తితో కోతుల బెడదను నివారించేందుకు నిర్మల్ జిల్లా చించోలి (బి)లో కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు వివరించారు. వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేశామని, ఇప్పటిదాకా రూ.49.115 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయని తెలిపారు. మంత్రి సమాధానం అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పందిస్తూ.. హరితహారం కార్యక్రమం భేష్ అని కితాబిచ్చారు.
కురుమల కులదైవమైన బీరప్పస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి ఇంద్రరణ్రెడ్డి తెలిపారు. బీరప్పస్వామి ఆలయాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 46 బీరప్పస్వామి ఆలయాల అభివృద్ధికి రూ.7.83 కోట్లు కేటాయించినట్టు
వెల్లడించారు.