హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గత ఎనిమిదిన్నరేండ్లలో కేవలం బీసీల కోసమే తమ ప్రభుత్వం రూ.48వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. హైదరాబాద్లోని కోకాపేట నియోపోలిస్ లే అవుట్లో మంగళవారం మరో నాలుగు బీసీ ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు టీ హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్తో కలిసి గంగుల శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇంత ప్రాధాన్యం ఎన్నడూ లభించలేదని చెప్పారు. తొమ్మిదేండ్లు పాలించిన చంద్రబాబు బీసీలకు రూ.2,037 కోట్లు కేటాయిస్తే.. ఆ తరువాత అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ఏనాడూ ఏడాదికి రూ.1000 కోట్లు మించి కేటాయించలేదని గుర్తుచేశారు. కేసీఆర్ సరార్ మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని, గురుకులాలు, కల్యాణలక్షితో పాటు కులవృత్తులకు చేయూతగా ఉచిత కరెంటును అందిస్తున్నదని తెలిపారు. అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్లో వేల కోట్ల విలువైన స్థలాలను కేటాయించిందని చెప్పారు. బీసీల పట్ల ఎంతో ప్రేమ ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.95.25 కోట్లు, 87.3 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. బీసీల వెనుకబాటును పారదోలేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కులవృత్తులకు ప్రాధాన్యం: శ్రీనివాస్గౌడ్
ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీలను అందరూ ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, వారి అవసరాలను ఏ ప్రభుత్వమూ తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేసారు. బీసీ కులవృత్తుల నుంచే నేటి ఆధునిక టెక్నాలజీ ఆవిర్భవించిందని అన్నారు. అలాంటి కుల వృత్తులకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈ మంచి పనిని దేశవ్యాప్తంగా ఉన్న కుల సంఘాలకు తెలియజేసి, తెలంగాణ ప్రగతిని విశ్వవ్యాప్తం చేయాలని అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించారని, రాష్ట్ర బడ్జెట్లో రూ.6200 కోట్లు కేటాయించారని అన్నారు. దీన్ని బట్టే బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలను కుల సంఘాలు అడిగినా స్థలాలు, నిధులు ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఊహించని విధంగా బీసీలలోని అన్ని కుల సంఘాలకు ఆత్మగౌవర భవనాలు ఉండేందుకు స్థలాలను ఇచ్చి, భవనాలు నిర్మించుకునేందుకు నిధులను ఇస్తున్నదని చెప్పారు. బీసీ భవనాలు నిర్మిస్తున్న ఈ స్థలం కొద్దిరోజుల క్రితమే హెచ్ఎండీఏ వేలంలో ఒక ఎకరం రూ.60 కోట్లు పలికిందని చెప్పారు.
ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినా.. బీసీ బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదని, ఈ భూమిని బీసీ భవనాల నిర్మాణానికి కేటాయించారని గుర్తుచేశారు. 2014 తరువాత తెలంగాణలో వచ్చిన మార్పును దేశమంతా చాటి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బండ ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
భవనాలను పరిశీలించిన మంత్రులు
కోకాపేట నియోపోలిస్ లే అవుట్లో ఇప్పటికే తొమ్మిది బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం జరుగుతుండగా, తాజాగా మరో నాలుగు కుల సంఘాల భవనాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఒక్కో ఎకరం స్థలంలో ఆరెకటిక, గాండ్ల కులాలకు భవనాలు నిర్మిస్తుండగా, చెరో అర ఎకరం స్థలంలో రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు మంత్రులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. మంగళవారం భూమిపూజ జరుపుకున్న సంఘాలతో కలిపి కోకాపేటలో ఇప్పటివరకు 13 కుల సంఘాలకు 37.20 ఎకరాల స్థలంలో రూ.49 కోట్ల ఖర్చుతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం జరుగుతున్నది.
ఈ సందర్భంగా యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మంత్రులు పరిశీలించారు. భవనాలకు ప్రహారీ గోడ, గేట్లు, ఆర్చి నిర్మాణం తదితర పనులకు అదనంగా రూ.2.60 కోట్లు కావాలని అధికారులు తెలపగా, వెంటనే విడుదల చేస్తున్నట్టు మంత్రులు ప్రకటించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఆత్మగౌరవ భవనాలలో యాదవ, కురుమ భవనాలు మొదటివని మంత్రులు తెలిపారు. అనంతరం కోకాపేట ఆత్మగౌరవ సముదాయాల్లో చేపట్టవలసిన రోడ్ల నిర్మాణం, వాటర్లైన్ వంటి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల ప్రారంభం సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వివరించారు.
మార్చి 10న గొల్ల, కురుమ ఆత్మగౌరవ భవనాల ప్రారంభం: మంత్రి హరీష్రావు
కోకాపేట నియోపొలిస్ లేఅవుట్లో నిర్మించిన గొల్ల, కురుమ ఆత్మ గౌరవ భవనాలను మార్చి 10న ప్రారంభించనున్నామని ఆర్థిక, వైదారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక వసతులను సంబంధిత అధికారులు కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా ఎంతో విలువైన ప్రాంతంలో ఆయా కుల సంఘాలకు స్థలాలను కేటాయించడంతో పాటు ప్రభుత్వ నిధులతోనే భవనాలను నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. ఈ భవనాలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవని, వీటికి అవసరమైన మౌలిక వసతులను కల్పించి గొల్ల, కురుమ సోదరులకు అందజేస్తామని తెలిపారు. ఈ భవనాల నిర్మాణం చివరి దశలో ఉండగా.. రోడ్డు సౌకర్యం, మంచినీటి సరఫరా వ్యవస్థలను పూర్తిస్థాయిలో అందజేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.