Summer | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది. 42-45 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రం ఇప్పుడు నిప్పుల పెనంగా మారింది. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణశాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోయాయి. ‘రెడ్ జోన్’లో చేరిపోయాయి. అంటే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదన్నమాట. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపాలగూరి, వనపర్తి జిల్లా పాన్గల్, జగిత్యాల జిల్లా వెల్గటూర్ల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. మిగతా అన్ని జిల్లాల్లో 42.7 డిగ్రీలు, ఆపైనే నమోదయ్యాయి. దీనిని బట్టి అన్ని జిల్లాలు ‘ఆరెంజ్ జోన్’లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా దిగ్వాల మండలంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అతితక్కువ అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మండలాలవారీగా చూసినప్పుడు ఏకంగా 15 మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఇందులో ఆరు మండలాలు నల్లగొండ జిల్లాలోనే ఉండటం గమనార్హం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. చార్మినార్ జోన్లో అత్యధికంగా 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది అదే జోన్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా ఉండగా.. ఈ సారి ఏకంగా 10 డిగ్రీలు పెరగడం గమనార్హం.
నిరుటి కంటే 4.5 డిగ్రీలు ఎక్కువ..
నిరుడు ఏప్రిల్ 28వ తేదీకి, ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చి చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తున్నది. గతేడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.9 డిగ్రీలు మాత్రమే కావడం గమనార్హం. సూర్యాపేట జిల్లా నర్సయ్యగూడెంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇసారి ఏకంగా 45 డిగ్రీల వరకు పెరిగాయి. గతేడాది అతితక్కువగా జగిత్యాల జిల్లాలో 33.2 డిగ్రీలు నమోదైంది.
మధ్యాహ్నం బయటికి రావొద్దు..
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉన్నందున తరచూ నీళ్లు తాగాలని, ఓఆర్ఎస్ తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్నవారు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.