ఉప్పల్ జోన్ బృందం, మే 12: లాక్డౌన్తో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక పలు ప్రాంతాలు బోసిపోయాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, జనంతో కిక్కిరిసిపోయే చౌరస్తాలు ఖాళీగా కనిపించాయి. ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు వెలవెల బోయాయి. ఉదయం 6 నుంచి పది గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వచ్చారు. నిత్యం రద్దీగా కనిపించే ఉప్పల్ రింగ్రోడ్డు, హబ్సిగూడ చౌరస్తా, నాచా రం, మల్లాపూర్ ప్రాంతాలు, ఈసీఐఎల్ చౌరస్తా, రాధికచౌరస్తా, కుషాయిగూడ, చక్రీపురం, హెచ్బీకాలనీ ప్రధాన రోడ్లలో జనసంచారం నిలిచిపోయింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలకు, ప్రభు త్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి మాత్రమే అవకాశం కల్పించడంతో కొన్ని వాహనాలు రోడ్లపై కనిపించాయి. పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి, గుర్తింపు కార్డులు ఉన్నవారిని పంపిస్తూ, నిబంధనలు పాటించని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఉప్పల్ పరిధిలో ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిలో, హబ్సిగూడ-ఉప్పల్ రహదారిలో, రామంతాపూర్-అంబర్పేట రోడ్డులో, ఉప్పల్-నాగోల్రోడ్డులో, నాచారంలో, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్రావునగర్ ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలింపు సమయంలో ఉప్పల్ బస్టాండ్ వద్ద ఊర్లకు వెళ్లేవారు బస్సుల కోసం తరలివచ్చారు.
చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రోడ్లు, కూడళ్లు లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న వ్యాపారాలను ఉదయం పది గంటలకే మూసివేశారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఐదు ఫేజ్లో 9 వందలకుపైగా పరిశ్రమలున్నాయి. ఉదయం ఉత్పత్తులను ప్రారంభించి లాక్డౌన్ సమయానికి మూసివేశారు. కుషాయిగూడ సీఐ మన్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, అడిషనల్ ఎస్పీ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పరిశీలించి పోలీస్ యంత్రాంగానికి సూచనలు చేశారు. ప్రజా రవాణాను నిషేధించడంతో ఈసీఐఎల్, చర్లపల్లి బస్టెర్మినళ్లు బోసిపోయాయి. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు శ్రీనివాస్రెడ్డి, రాములు, ఎస్సైలు శ్రీనివాస్, అనంతచారి, మదన్లాల్, రవికుమార్, నాగేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
లాక్డౌన్కు కాప్రా ప్రజలు మద్దతుగా నిలిచారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు తెచ్చుకున్నారు. 10 గంటల నుంచి దుకాణాలన్నీ మూసివేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కాప్రా, నేతాజీనగర్, సైనిక్పురి చౌరస్తాల్లో జన సంచారం, వాహనాల రాకపోకలు స్తంభించాయి.
మల్లాపూర్, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఉదయం పది గంటల నుంచి ఇంటికే పరిమితమయ్యారు.
ఉప్పల్/చర్లపల్లి, మే 12: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. లాక్డౌన్ అమలు తీరుపై ఉప్పల్, ఈసీఐఎల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను పరిశీలించారు. పలు వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా రాచకొండ కొవి డ్ కంట్రోల్ రూం నంబర్ 94906 17234కు ఫోన్ చేయాలని తెలియజేశారు. ఉప్పల్ ఏసీపీ శ్యాంప్రసాద్రావు, ట్రాఫిక్ ఏసీపీ రాజు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.