హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నట్టు వైద్యశాఖ తెలిపింది. కళాశాలల వారీగా పోస్టుల వివరాలను, ఆయా కాలేజీల వెబ్సైట్లలో, డీఎంఈ వెబ్సైట్ dme.telangana.gov.inలో పొందుపరిచారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కాలేజీల్లో ఈ నెల 16న ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ పోస్టుల భర్తీతో ప్రభుత్వంపై ఏటా రూ.634 కోట్ల భారం పడుతుందని,కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ద్వారా ఎంపికలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
జీవో 317 లోపాలపై లోతైన అధ్యయనం
జీవో 317 లోపాలపై లోతైన అధ్యయనం చేయాలని మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన సబ్ కమిటీ సచివాలయంలో నిర్ణయించింది. జీవోలు 317, 46 సమస్యలపై అధికారులను సబ్ కమిటీ అడిగి తెలుసుకొన్నది. దీనిపై ఈ నెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు స్వీకరించాలని, ఇందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు జితేందర్, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు క్రిస్టినా జెడ్ చొంగ్తూ, నిర్మల, పీఆర్సీ కమిటీ చైర్మన్ శివ శంకర్, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, ఇంటర్ విద్య డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.