సిద్దిపేట, మే 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకొడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తడిసిన వడ్లను యుద్ధ్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో మంత్రులంతా కల్లాల్లో తిరిగారని, ఇప్పుడు ఒక్క మంత్రి అయినా కల్లాల్లో కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. మంత్రులు హైదరాబాద్లో కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వడ్లు కొనకపోవడంతో అవి వర్షాలకు తడుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
వడ్లు కొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చిన్నకోడూరులో తాము క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు రైతులు 20 నుంచి 25 రోజులుగా ఇక్కడే ఉన్నామని చెప్పారని తెలిపారు. తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తున్నా, అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్మిల్కు తీసుకెళ్తే తేమ శాతం ఉన్నదని, మొలకెత్తిందని చెప్పి ఒక సంచికి మూడు కిలోలు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తరుగు తీసేయకుండా వడ్లు కొనాలని, తక్షణమే తడిసిన వడ్లు కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇంకా 40% ధాన్యం కల్లాల్లో ఉన్నదని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన లారీల సంఖ్యను పెంచి త్వరితగతిన వడ్లు కొనాలని కోరారు.
ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500, మక్కలకు, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తున్నదని హరీశ్రావు విమర్శించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వకపోతే భవిష్యత్తులో రైతులు నిలదీస్తారని హెచ్చరించారు. సన్నవడ్లకు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, కాలపరిమితి ఎక్కువ కాబట్టి ఎవరూ పండించరని చెప్పారు. ఇంట్లో వాడుకునేందుకు మాత్రమే సన్నవడ్లను పండిస్తామని చాలామంది రైతులు చెప్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3,38,389 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో దొడ్డు రకం 3,21,469 ఎకరాల్లో, సన్నరకం 16,920 ఎకరాల్లో మాత్రమే పండించారని వివరించారు.
95% దొడ్డు వడ్లు, 5 శాతమే సన్నవడ్లు పండిస్తారని.. అవి కూడా ఇంటి కోసమే అని చెప్పారు. రైతులు ఎంతో కష్టపడి వరి పండిస్తే వడ్లు కొనకుండా తాత్సారం చేయడంతోపాటు బోనస్ ఇవ్వకుండా మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనుము, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కావాలన్నా స్టాక్ ఉంచిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టినట్టు, ఇప్పుడు మళ్లీ పాస్బుక్లు లైన్లో పెట్టే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. వెంటనే పచ్చిరొట్ట విత్తనాలు ఆగ్రోస్ సెంటర్లలో, పీఏసీఎస్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.