హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని 63 దేశాల్లో భారత్ నుంచి ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషమని చెప్పారు. ఈ ఘనత అంత ఆషామాషీగా ఏమీ రాలేదన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో రాష్ట్రంలో పచ్చదనం సుమారు 4 శాతం పెరిగినట్లు వెల్లడయింది. కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా మొక్కలు నాటడం, చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్పూర్తి మరికొంత కాలం సాగాలి. హరిత లక్ష్యం సిద్ధించే వరకూ అందరూ పట్టుబట్టి మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా పెంచాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్కు ఎంతో పేరు వచ్చింది. హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు ప్లై ఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. అది నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, సాయంత్రం పూట జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతున్నది’ అని సీఎం అన్నారు.
కాకతీయు కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ గుర్తింపు వెనక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. తెలుగు నేలపై మొదటిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రిక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నదని చెప్పారు.
స్వయం పాలనలో తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. అందులో భాగమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం. యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని, చరిత్రలో నిలిచిపోతుందని ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాచీనకళలు, వారసత్వం, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా పునర్నిర్మించడం పట్ల భక్తులు, సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.