హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నిమ్స్ మరో అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరపడం దేశంలో ఇదే మొదటిసారి. తక్కువ సమయంలోఎక్కవ సర్జరీలు చేసే వెసులుబాటు, అత్యాధునిక వైద్యసౌకర్యాలు చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ తరువాత నిమ్స్లోనే ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
ప్రతి ఆరు గంటలకు ఒక కిడ్నీ మార్పిడి చొప్పున 17 మంది వైద్యుల బృందంతో కలిసి 24గంటల్లో మూడు కడావర్, ఒకటి లైవ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిపినట్టు యూరాలజి అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొఫెసర్స్ డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. గత కొన్నేండ్లుగా డయాలసిస్పై జీవిస్తున్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఖలీల్ అహ్మద్ (41), కరీంనగర్ జిల్లాకు చెందిన సాత్విక (22), హైదరాబాద్కు చెందిన సంతోష్ కుమార్ (29), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి (48) కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం రాత్రి వీరికి జీవన్దాన్ ద్వారా మూడు కడావర్ (బ్రెయిన్డెడ్కు గురైనవారి)కిడ్నీలు సీరియల్నంబర్ ప్రకారం లభించాయి.
24 గంటల్లో 4 కిడ్నీ మార్పిడిలు
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప సహకారంతో యూరాలజి అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాధిపతులు డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తమ వైద్యబృందంతో కలిసి సోమవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఖలీల్ అహ్మద్కు తొలుత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిపారు. ఆ తరువాత విరామం లేకుండా వెంట వెంటనే ప్రతి 6 గంటలకు ఒకటి చొప్పున మొత్తం 24గంటల్లో నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపినట్టు డాక్టర్ రాహుల్ వివరించారు.
భార్యకు భర్త కిడ్నీ దానం
సామాజికంగాను, సాంకేతికంగాను ఓ భర్త తన భార్యకు కిడ్నీ దానం చేయడం చాలా అరుదైన విషయం. వెంకటలక్ష్మికి మాత్రం ఆమె భర్త తన కిడ్నీ దానం చేశారు. సాధారణంగా కిడ్నీ దానం చేయాలంటే దాత, స్వీకర్తలకు సంబంధించి బ్లడ్ గ్రూప్లు కలవాలని, హెచ్ఎల్ఏ (జెనెటికల్ మ్యాచింగ్), లింపోసైట్ క్రాస్ మ్యాచింగ్ (ఎల్సీఎం) జరగాల్సి ఉం టుందని డాక్టర్ రాహుల్ వివరించారు. అయి తే వెంకటలక్ష్మి విషయంలో కిడ్నీ దాత ఐన ఆమె భర్త బ్లడ్గ్రూప్ ఓ-పాజిటివ్ కావడం, ఇతర అన్నిరకాల మ్యాచింగ్లు కుదరడంతో శస్త్రచికిత్సకు లైన్ క్లియరైందన్నారు.
ఐదు గంటల ప్రిపరేషన్
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు కార్పొరేట్ దవాఖానలో రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగానే చేస్తున్నాం. జీవితకాలంపాటు ఇమ్యునోసప్రెషన్ మందులను సైతం ఉచితంగానే ఇస్తున్నాం. ప్రతి ట్రాన్స్ప్లాంట్కు ముందు రోగికి సుమారు ఐదు గంటల ప్రిపరేషన్ ఉంటుంది. ఆ తరువాత సర్జరీకి ఐదారు గంటల సమయం పడుతుంది. నిమ్స్లో లామినార్ ఫ్లో ఉండడం వల్ల థియేటర్లలో ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుంది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల నిమ్స్లో ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు సులభంగా చేయగలుగుతున్నాం. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రోత్సాహంతో అరుదైన శస్త్రచికిత్సలకు కృషిచేస్తున్నాం.
– డాక్టర్ రాహుల్దేవరాజ్, ప్రొఫెసర్ ఆఫ్ యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్