హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళానేతలను ఘనంగా శాలువాలతో సన్మానించారు. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పార్లమెంట్లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. సమాజం లో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అవకాశాలను అందిపుచ్చుకొని అత్యున్నతస్థాయికి చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. వారి పేరిటే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని తెలిపారు.