హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో బుధవారం 32 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ కోకాపేట, ఉప్పల్ భగాయత్లో ఆత్మగౌరవ భవనాల కోసం 41 బీసీ కుల సంఘాలకు వేల కోట్ల విలువ చేసే 87.3 ఎకరాల భూమిని కేటాయించారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 5న కోకాపేట, 6న ఉప్పల్ భగాయత్, పీర్జాదిగూడల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేస్తామని వెల్లడించారు. అనుమతి పత్రాలు పొందిన ఏ బీసీ కులమైనా నిర్దేశిత గడువులోగా పనుల ప్రారంభానికి ముందుకు రాకపోతే ప్రభుత్వమే సొంతంగా చేపడుతుందని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి 31లోగా స్లాబ్ లెవెల్ పనులు పూర్తి చేయాలని, దసరా నాటికి భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల్లో కల్యాణ వేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టళ్లు, రిక్రియేషన్ తదితర అన్ని సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
తక్షణమే మౌలిక వసతులు
కోకాపేట, ఉప్పల్ భగాయత్ తదితర బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాంగణాల్లో ఈ నెలాఖరులోగా రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతోపాటు హెచ్ఎండీఏ, విద్యుత్తు, వాటర్ వర్స్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులను సమన్వయపరిచి నిర్ణీత కాలంలో పనులు పూర్తయ్యేలా అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖాపరంగా అన్ని పనులు చూసుకొనేందుకు లైజనింగ్ ఆఫీసర్లను సైతం నియమించామని తెలిపారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులున్నా సంబంధిత కులసంఘాలు నేరుగా తనను సంప్రదించొచ్చని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మల్లయ్య బట్టు, చంద్రశేఖర్, సంధ్య, విమల, ఉదయ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మికి నిధుల కొరత లేదు: మంత్రి గంగుల
రాష్ట్రంలో ఏ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఇబ్బంది పడొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనికి నిధుల కొరత అన్న ప్రశ్నే లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు బీసీ, ఈబీసీలకు చెందిన 5.89 లక్షల కుటుంబాలకు రూ.5,369 కోట్లు అందజేసినట్టు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ సంక్షేమ భవన్లో బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం 1.11 లక్షల దరఖాస్తులు రాగా, వెరిఫికేషన్ నిమిత్తం 32 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వారం రోజుల్లో వీటన్నింటిని పరిశీలించి క్లియర్ చేయాలని ఆదేశించారు.