తాండూరు రూరల్, ఏప్రిల్ 7 : రూర్బన్ పథకం కింద పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ మే నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేసినట్లు డీఆర్డీవో కృష్ణన్ తెలిపారు. బుధవారం తాండూరు మండలం బెల్కటూర్, ఓగిపూర్, సంగెంకలాన్, గుండ్లమడుగుతండా గ్రామాల్లోని పెండింగ్ పనులను పరిశీలించారు. బెల్కటూర్లో అంగన్వాడీ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఓగిపూర్లో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి మూడు స్థలాలను పరిశీలించారు. గ్రామ కంఠం, రెవెన్యూ భూమితోపాటు ఓ ప్రైవేట్ భూమిని అధికారులు పరిశీలించారు. ఈ మూడింటిలో ఒకదాన్ని సెలెక్టు చేసుకుంటే వెంటనే నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పద్మమ్మకు అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా డీఆర్డీవో కృష్ణన్ మాట్లాడుతూ రూర్బన్ పథకం కింద తాండూరు మండలంలోని అల్లాపూర్ గ్రామాన్ని క్లస్టర్గా ఎంపిక చేశారని తెలిపారు. ఈ పథకం కింద మండలానికి రూ.30 కోట్లు మంజూరు కాగా, మొదటి విడుత రూ.18 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు వివిధ అభివృద్ధి పనులకు రూ.11.62 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. జినుగుర్తి సమీపంలో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. అందులో ఫర్నిచర్, ఇతర చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ స్కీం కింద 104 రకాల అభివృద్ధి పనులు తీసుకున్నామన్నారు. అందులో ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం పనులని తెలిపారు. ఈ పనులన్నీ ప్రగతిలో ఉన్నాయన్నారు. మీ సేవ కేంద్రాలు 24 మంజూరు కాగా, ఇంకా 9 కేంద్రాల పనులు ప్రారంభించలేదన్నారు.
వాటి నిర్మాణాలకు స్థల సమస్యలు, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని కూడా అధిగమించి త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పంచాయతీ భవన నిర్మాణాలు కూడా త్వరగా నిర్మిస్తున్నామన్నారు. బిల్లులు చెల్లించడంలేదని ప్రశ్నించగా.. ఎంబీ పూర్తయితే వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని, బిల్లులు ఆపడంలేదని డీఆర్డీవో తెలిపారు. అంగన్వాడీలు, స్కూళ్లలో చిన్నచిన్న మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని, బిల్లులు వెంటనే చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, ఏపీవో నరోత్తమ్రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.