Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘టీఎస్పీఎస్సీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టాలు పడుతున్నారు’ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం చేస్తున్న విమర్శ ఇది. వీరి మాటలను చూసి నిరుద్యోగులే నవ్వుకొంటున్నారు.టీఎస్పీఎస్సీ ఏర్పడి నప్పటి నుంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) నమోదుచేసుకొన్నవారి మొత్తమే 30 లక్షలు ఉన్నది. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు.
నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కమిషన్ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే దానికి అర్హత ఉన్నవారే దరఖాస్తు చేసుకొంటారు. కానీ, బీజేపీ నేత బండి సంజయ్లాంటివాళ్లకు ఓటీఆర్ చేసుకొన్న 30 లక్షల మందీ అన్ని నోటిఫికేషన్లకూ దరఖాస్తు చేసుకొన్నట్టుగా కనిపిస్తున్నది. టీఎస్పీఎస్సీలో మొత్తం 30,88,410 మంది ఓటీఆర్ చేసుకున్నారు. అందులో 17,47,258 మంది పురుషులు, 13,40,946 మంది మహిళలు ఉన్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయాలంటే ఓటీఆర్ చేసుకోవటం తప్పనిసరి కావటంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ముందుగానే ఓటీఆర్ చేసుకొని ఉంటారు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారి ఓటీఆర్లు కూడా కమిషన్ వెబ్సైట్లో కొనసాగుతూనే ఉంటాయి. మరి వీళ్లంతా నిరుద్యోగులా? కమిషన్ రద్దుచేసిన నాలుగు నోటిఫికేషన్లకు వీల్లంతా దరఖాస్తు చేశారా? అని బుద్ధిజీవులు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. ఓటీఆర్ చేసుకున్న వారిలో సుమారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా రు. ఇంకొంతమంది వయోపరిమితి ముగిసింది. అయినప్పటికీ వారు ఓటీఆర్లో నుంచి బయటికి రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిజాన్ని పక్కన పెట్టి అబద్ధపు ప్రచారానికి తెరలేపాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీఎస్పీఎస్సీ రద్దు చేసిన నాలుగు పరీక్షలకు మొత్తం 6,42,506 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, అందులో పరీక్ష రాసింది 4,70,387 మంది మాత్రమే. 503 గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మందే హాజరయ్యారు. అందులో నుంచి 25,050 మంది మెయిన్కు ఎంపికయ్యారు. 833 ఏఈ ఉద్యోగాలకు 55,189 మంది, 1,540 ఏఈఈ ఉద్యోగాలకు 61,452 మంది, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(వర్క్స్) గ్రేడ్-2 ఉద్యోగాలకు 67,830 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే.. నాలుగు పరీక్షలకు కలిపి మొత్తం హాజరైంది 4,70,387 మంది మాత్రమే. అనివార్య కారణాలతో 1,72,119 మంది పరీక్షకు హాజరు కాలేదు. అయితే.. టీఎస్పీఎస్సీ మాత్రం దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇవన్నీ కనిపించినా ప్రతిపక్షాలు మాత్రం అనసవరపు రాద్దాంతం చేస్తున్నాయి. పరీక్ష రాసింది కేవలం 4,70,387 మంది అభ్యర్థులే అయినప్పటికీ, మొత్తం 30 లక్షల మంది యువతకు అన్యాయం జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో నిరుద్యోగం తగ్గడం, అనతికాలంలోనే 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం వంటివన్నీ జీర్ణించుకోలేక యువతను పక్కదారి పట్టిస్తున్నాయి.
1) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన శ్రీకాంత్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తోపాటు డీఏవో ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. గ్రూప్-1 మెయిన్స్కు కూడా ఎంపికయ్యాడు.
2) కరీంనగర్కు చెందిన మల్లేశ్ పదేండ్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ఖాళీ సమయాల్లో చదువుతున్నాడు. ప్రస్తుతం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికయ్యాడు.
3) హైదరాబాద్కు చెందిన టీ రవికుమార్ ప్రైవేట్ కంపెనీలో 12 ఏండ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-1తోపాటు గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు.
ఇలా.. ఒక ఉద్యోగం చేస్తూ టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకొన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం 30 లక్షల మంది నిరుద్యోగులు అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. నిజాన్ని సమాధి చేసేసి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి.
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ యుద్ధప్రాతిపదికన స్పందించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిట్ దర్యాప్తు వేగంగా సాగుతున్నది. సందేహం ఉన్న కొన్ని ఉద్యోగాలను ముందస్తుగానే రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, మిగిలిన ఉద్యోగాలకూ త్వరలోనే పరీక్ష ఉంటుందని, అభ్యర్థు లు ఆధైర్య పడొద్దని, అసత్య ఆరోపణలు నమ్మి ప్రిపరేషన్ను పక్కన పెట్టొద్దని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి సూచించారు. అయితే, అభ్యర్థులు మళ్లీ ప్రిపరేషన్లో పడిపోతారేమో అనే భయంతో కొందరు 30 లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఓటీఆర్ చే సుకున్న ప్రతిఒక్కరూ నిరుద్యోగులు కాదన్న విషయం సత్యం. కానీ, ప్రతిపక్ష నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, యువతను రాజకీయ దురుద్దేశంతోనే పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ‘30 లక్షల మంది నిరుద్యోగులు’ అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో కమిషన్ తొలుత టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షను రద్దు చేసింది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే వేరేవాళ్లకు విక్రయించినట్టు తెలిసింది. అయితే, కమిషన్ మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. తెలంగాణ యువతకు అన్యాయం జరగకూడదనే సదుద్దేశంతో మిగిలిన మూడు పరీక్షలను రద్దు చేసింది. మిగతా పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో జరగడంతో వాటిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, నాలుగు పరీక్షలకు కలిపి మొత్తం దరఖాస్తు చేసింది ఆరు లక్షల మంది మాత్రమే. గ్రూప్-1లో 503 ఉద్యోగాలకు 3,80,204 మంది, 1540 ఏఈఈ ఉద్యోగాలకు 81,571 మంది, 833 ఏఈ ఉద్యోగాలకు 74,478 మంది, 53 డీఏవో ఉద్యోగాలకు 1,06,253 మంది దరఖాస్తు చేశారు. ఈ నాలుగు పరీక్షలకు కలిపి మొత్తం దరఖాస్తు చేసిన వారి సంఖ్య 6,42,506. అయితే, ఇందులోనూ రెండు, మూడు పరీక్షలకు దరకాస్తు చేసుకున్న అభ్యర్థులు భారీగానే ఉండే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. ఐదు లక్షల లోపే అసలు అభ్యర్థులుగా అంచనా వేయవచ్చు. .