హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3 ఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. వివిధ కారణాలతో సంప్రదాయ విద్యుత్తు లైన్లు వేయలేని గిరిజన ఆవాసాల్లో సోలార్ విద్యుత్తును అందించాలని సూచించారు. గిరిజన ఆవాసాలన్నింటికీ విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు 3 ఫేజ్ విద్యుత్తు సౌకర్యం, గిరివికాసం కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్లో అటవీ, విద్యుత్తుశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ఆవాసా ల్లో 3 ఫేజ్ విద్యుదీకరణ జరగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, గత రెండు బడ్జెట్లలో రూ. 221.01 కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలోని 3,467 ఆవాసాల్లో విద్యుత్తు సౌకర్యం లేదని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే 2,795 ఆవాసాల్లో (81శాతం) 3 ఫేజ్ విద్యుదీకరణ పూర్తిచేసినట్టు వివరించారు. గిరిజన వికాసం పథకంలో భాగంగా 34,838 మంది గిరిజన రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో 3 ఫేజ్ విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, క్రిస్టినా జడ్ చోంగ్తూ, అటవీ శాఖ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.